పుణె: ఐపీఎల్లో వేగవంతమైన అర్ధశతకం (14 బంతుల్లో) రికార్డును సమం చేసిన ఇన్నింగ్స్ ఆడింది తానేనని ఆశ్చర్యపోయినట్లు కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. బుధవారం ముంబైతో జరిగిన పోరులో కమిన్స్ 15 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. ‘ఈ ఇన్నింగ్స్తో నేనే ఆశ్చర్యపోయా. కానీ జట్టును గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. బంతి నా పరిధిలో పడితే చాలు దానిపై విరుచుకుపడాలని ముందే అనుకున్నా.. అదృష్టవశాత్తు అది కలిసొచ్చింది’ అని పేర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్లో భారీ షాట్లు ఆడటంపై కమిన్స్ స్పందిస్తూ.. ‘అతడిని (బుమ్రాను) ఎదుర్కొన్న ప్రతిసారీ ఒకే ప్లాన్తో బ్యాటింగ్ చేస్తా. అతడి బంతులను వీలైనంత బలంగా బాదాలనుకుంటా. కొన్నిసార్లు అది వర్క్ అయ్యింది. వెంకటేశ్ అయ్యర్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడిపై భారం తగ్గించేందుకు ధాటిగా ఆడాలనుకున్నా. ప్రతి బంతిని భారీ షాట్ ఆడాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ చేశా. బౌండ్రీ చిన్నగా ఉన్న వైపు ఎక్కువ షాట్లు ఆడటంతో నా పని ఇంకా సులువైంది’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.