సీజన్ ఆరంభ పోరులో గుజరాత్ చేతిలో ఓడిన ధోనీ సేన దానికి బదులు తీర్చుకుంది. సొంతగడ్డపై అశేష అభిమాన సందోహం ఉత్సాహపరుస్తున్న వేళ అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో దుమ్మురేపిన చెన్నై.. క్వాలిఫయర్-1లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించి సగర్వంగా పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరుగనున్న మెగా ఫైట్లో ట్రోఫీ కోసం ధోనీ సేన బరిలోకి దిగనుండగా.. హార్దిక్ బృందానికి క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్ చేరేందుకు మరో చాన్స్ ఉంది!
చెన్నై: సొంతగడ్డపై చెన్నై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై మొదట మంచి స్కోరు చేసిన ధోనీ సేన.. ఆనక గుజరాత్ను కట్టడి చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఐపీఎల్ ఫైనల్ ఆడనుండటం చెన్నైకి ఇది పదోసారి కావడం విశేషం. పసుపు రంగు పులుముకున్న చెపాక్ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్లో చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తుచేసింది. ఐపీఎల్లో గుజరాత్పై చెన్నైకి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టిక టాప్లో నిలిచిన గుజరాత్కు క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, ఒక సిక్సర్), కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు.
వీరిద్దరూ తొలి వికెట్కు 87 పరుగులు జతచేయగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన శివమ్ దూబే (1), అజింక్యా రహానే (17), అంబటి రాయుడు (17), రవీంద్ర జడేజా (22) ఆకట్టుకోలేకపోయారు. సొంతగడ్డపై ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (1) ఎక్కువసేపు నిలువ లేకపోయాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. వరుస సెంచరీలతో జోరు మీదున్న యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, ఒక సిక్సర్) కాస్త పోరాడగా.. తక్కినవాళ్లు విఫలమయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8), సాహా (12), దసున్ షనక (17), మిల్లర్ (4), విజయ్ శంకర్ (14), రాహుల్ తెవాటియా (3) పెవిలియన్కు వరుస కట్టారు. రషీద్ ఖాన్ (16 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, జడేజా, తీక్షణ, పతిరణ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రుతురాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా గురువారం చెన్నైలో జరుగనున్న ఎలిమినేటర్లో లక్నోతో ముంబై తలపడనుంది.
ఐపీఎల్ క్వాలిఫయర్స్ సందర్భంగా బీసీసీఐ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో భాగంగా నమోదయ్యే ఒక్కో డాట్ బాల్కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించింది. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. అందుకు తగ్గట్లే మంగళవారం మ్యాచ్ ప్రసారాల సందర్భంగా డాట్ బాల్ స్థానంలో మొక్కలు దర్శనమిచ్చాయి.
చెన్నై: 172/7 (రుతురాజ్ 60, కాన్వే 40; షమీ 2/28, మోహిత్ 2/31), గుజరాత్: 20 ఓవర్లలో 157 ఆలౌట్ (గిల్ 42, రషీద్ 30; జడేజా 2/18, తీక్షణ 2/28).