IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ రేపటితో షురూ కానుంది. ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK), డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(GT)ను ఢీ కొననుంది. అయితే.. గాయం కారణంగా యంగ్ పేసర్ ముఖేశ్ చౌదరీ(Mukesh Choudhary) సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి ప్లేస్లో అండర్ -19 వరల్డ్ కప్ ప్లేయర్ ఆకాష్ సింగ్(Akash Singh)ను తీసుకుంటున్నట్లు సీఎస్కే ఈరోజు ప్రకటించింది. ‘గత సీజన్లో ఐపీఎల్ ఆరంగేట్రం చేసిన ముఖేశ్ 16 వికెట్లు తీశాడు. అతను ప్రస్తుతం స్ట్రెస్ ఫ్రాక్చర్ నుంచి కోలుకుంటున్నాడు. దాంతో, ఈ సీజన్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆకాశ్ సింగ్ను తీసుకున్నాం’ అని సీఎస్కే ఫ్రాంఛైజీ తెలిపింది.
ఎడమ చేతివాటం పేసర్ అయిన ఆకాశ్ సింగ్ 2020 అండర్ -19 వరల్డ్ కప్లో ఆడాడు. ఈ యంగ్స్టర్కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. గత సీజన్లో అతను రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ‘ఇప్ప టివరకు ఆకాశ్ 9 టీ20లు, భారత- ఏ జట్టు తరఫున 9 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 31 వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ యంగ్స్టర్ను రూ. 20 లక్షలకు మా ఫ్రాంఛైజీలో చేరుతున్నాడు’ అని చెన్నై సూపర్ కింగ్స్ వెల్లడించింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (మార్చి 31న) ఐపీఎల్ పండుగ షురూ కానుంది. సాయంత్ర 5ః30 గంటల నుంచి ఓపెనింగ్ సెరమొనీ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు. ఇండియా క్రష్గా పేరొందిన కన్నడభామ రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్(Arjith Singh) తన గాత్రంతో అభిమానులను ఫిదా చేయనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.