Cricketers – Restaurants : ఉపఖండంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ క్రికెట్. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో క్రికెటర్లను అభిమానులు నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటారు. ఒక్కో గేమ్కు అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్లు కూడా ఈ దేశాల్లో ఉన్నారు. ఆటలో రాణించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవాళ్లలో ఎంతోమంది ఫుడ్ బిజినెస్(Food Business)లో అడుగు పెట్టారు. ఫేమ్లో ఉండగానే వారంతా రెస్టారెంట్లు(Restaurants) ప్రారంభించి అభిమానులకు మరింత చేరువయ్యారు. ఈమధ్యే మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) అమ్స్టర్ డాంలో తన పేరుతో రెస్టారెంట్ తెరిచాడు. అయితే.. ఈ వ్యాపారంలో నష్టాలు మూటగట్టుకున్న వాళ్లూ ఉన్నారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్ వంటివారు ఆ జాబితాలో ఉన్నారు. కానీ, మరికొందరు మాత్రం దిగ్విజయంగా రెస్టారెంట్లు నడుపుతున్నారు. వాళ్లు ఎవరంటే..?
దూకుడుకు మారు పేరైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohi) తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ‘వన్8 కమ్యూన్'(One8 Commune) పేరుతో విరాట్ రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్నాడు. 2022లో ముంబైలోని జుహులో ఉన్న దివంగత గాయకుడు కిశోర్ కుమార్ బంగ్లాలో తొలి రెస్టారెంట్ను ప్రారంభించాడు.
విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ
ఆ తర్వాత పూణె, ఢిల్లీ, కోల్కతాకూ వీటిని విస్తరించాడు. శాఖాహారులకు వన్8 కమ్యూన్ చక్కని డెస్టినేషన్ అనే చెప్పాలి. ఇక్కడ విభిన్న రుచుల్లో, వంటకాలతో మంచి శాఖాహార భోజనం లభిస్తుంది.
భారత్కు ప్రాతినిధ్యం వహించిన సురేశ్ రైనా(Suresh Raina) టాప్ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 2005-2018 మధ్య కాలంలో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఆగస్టు 2020లో మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు.
ఆమ్స్టర్డామ్లో రైనా రెస్టారెంట్
మేజర్ టీ20 లీగ్స్లో కామెంటేటర్గా పనిచేస్తున్న రైనా ఈ ఏడాది జూన్లో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ‘రైనా ఇండియన్ రెస్టారెంట్'(Raina Indian Restaurant) ఫుడ్ బిజినెస్ ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్లో సమోసా, దహీభల్లా, పానిపూరీ, సూప్, జీరా రైస్, వెజ్ బిర్యానీ వంటి భారతీయ వంటకాలు కూడా లభిస్తాయి.
మన దేశానికి గర్వకారణమైన క్రికెటర్లలో కపిల్దేవ్(Kapil Dev) ఒకడు. 1983లో దేశానికి తొలి ప్రపంచకప్ అందించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 16 ఏళ్లపాటు టీమిండియాకు సేవలందించిన కపిల్ 2008లో బీహార్ రాజధాని పాట్నాలో క్రికెట్ థీమ్ రెస్టారెంట్ ‘ఎలెవెన్స్'(Elevens) ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్ ఇండియన్, పాన్-ఏసియన్, కాంటినెంటల్ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. దీంట్లో ఓ బార్, లాంజ్ కూడా ఉంది.
టీమిండియా అత్యుత్తమ ఆల్రౌండర్లలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ముందు వరుసలో ఉంటాడు. ఫిబ్రవరి 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జడ్డూ.. అన్ని ఫార్మాట్లలో కలిపి 300 మ్యాచుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ ఆల్రౌండర్ రాజ్కోట్లో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మూడేళ్లకే ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్'(Jaddu’s Food Field) పేరుతో డిసెంబరు 2012లో రెస్టారెంట్ ప్రారంభించాడు.
రవీంద్ర జడేజా రెస్టారెంట్
అయితే.. 2017లో రాజ్కోట్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించి పాడైపోయిన ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రెస్టారెంట్ను పునరుద్ధరించారు. జడేజా సోదరి నైనా జడేజా 2018లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జడేజా మంచి ప్రదర్శన కనబరిచిన ప్రతిసారీ వినియోగదారులకు ఉచితంగా డెజర్ట్స్ సర్వ్ చేస్తున్నట్టు చెప్పారు.
టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోనీ(MS Dhoni) భారత క్రికెట్కు అందించిన సేవలు అమోఘం. 2004-2009 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ తన నాయకత్వ లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ తప్పుకున్నాడు.
ధోనీ ‘శాఖాహారీ’ అవుట్లెట్
40 ఏళ్ల ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డిసెంబరు 2022లో బెంగళూరు విమానాశ్రయంలో వెగానిజమ్ (శాఖాహారం)ను ప్రమోట్ చేసే ఉద్దేశంతో ‘శాఖాహారీ’ (Shaka Harry)పేరుతో తొలి అవుట్లెట్ ప్రారంభించాడు. ఈ రెస్టారెంటుకు ఆధారమైన మొక్కల ఆధారిత కంపెనీలో ధోనీ పెట్టుబడులు ఉన్నాయి.
టీమిండియా మాజీ పేసర్ జహీర్ఖాన్(Zaheer Khan) 2005 నుంచి ఆతిథ్య రంగంలో ఉన్నాడు. పూణెలో జడ్కే’స్ డైన్ఫైన్ (ZK’s Dine Fine) ను ప్రారంభించడం ద్వారా ఈ రంగంలో అడుగుపెట్టాడు. ఇందులో వినియోగదారులకు ఇండోర్, అవుట్డోర్లోనూ సర్వ్ చేస్తారు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 2013లో నగరంలోనే ‘టాస్ స్పోర్ట్స్ లాంజ్'(Toss Sports Lounge in Pune) ప్రారంభించాడు. పూర్తిగా స్పోర్ట్స్ థీమ్తో రూపుదిద్దుకున్న ఈ రెస్టారెంట్లో తందూరీ, కాంటినెంటల్, ఓరియెంటల్ వంటకాల రుచి చూడొచ్చు.
విజయవంతమైన ఓపెనర్లలో శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఒకడు. 13 ఏళ్ల క్రికెట్ కెరియర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన ధావన్ ఈ ఏడాది ‘ది ఫ్లయింగ్ క్యాచ్’ (The Flying Catch) పేరుతో దుబాయ్లో స్పోర్ట్స్ కేఫ్ ప్రారంభించాడు. ఆరోగ్యకరమైన జీవన శైలిని కోరుకునేవారిని ఉద్దేశించి ఈ రెస్టారెంట్ ప్రారంభించాడు.
శిఖర్ ధావన్
మరీ ముఖ్యంగా దుబాయ్లో ఇండియన్స్ను దృష్టిలో పెట్టుకుని దీనిని ప్రారంభించాడు. ఇందులో ప్రపంచకప్ లాంటి మ్యాచ్లను వీక్షించే సదుపాయం కూడా ఉంది. కొంతసమయం పాటు ప్రశాంతంగా గడిపేందుకు ఇది చక్కని ప్లేస్.
వెటరన్ పాకిస్థాన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు. 1999 నుంచి పాకిస్థాన్కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్రికెట్ ద్వారా పేరు ప్రఖ్యాతులతోపాటు లెక్కలేనంత డబ్బు కూడా సంపాదించాడు. జనవరి 2022లో షకీబ్ రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. లాహోర్లోని ఖరీదైన ప్రాంతంలో ‘ది రైస్ బౌల్'(The Rice Bowl) పేరుతో రెస్టారెంట్ ప్రారంభించాడు. లెజండరీ సింగర్ అతీఫ్ అస్లామ్ అకస్మాత్తుగా రెస్టారెంట్ను సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
శ్రీలంక క్రికెట్కు కుమార సంగక్కర, మహేల జయవర్ధనె అందించిన సేవలు చిరస్మరణీయం. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో వీరిద్దరూ 624 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2015 ప్రపంచకప్ తర్వాత వీరిద్దరూ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. డిసెంబరు 2011లో రాజధాని కొలంబోలో మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్ (MOC) పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు.
కుమార సంగక్కర, మహేల జయవర్ధనె
శ్రీలంక సీ ఫుడ్తో ఇక్కడ అద్భుతమైన వంటలు దర్శనమిస్తాయి. 2019లో ముంబైలోకీ ఈ రెస్టారెంట్ ఎంటరైంది. మాల్దీవ్స్, బ్యాంకాక్, షాంఘై, చెంగ్డు, మనీలా సహా ప్రపంచంలో ఏడు నగరాల్లో ఇప్పుడు దీనికి అవుట్లెట్లు ఉన్నాయి.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్ 17 ఏండ్ల క్రికెట్ కెరియర్ తర్వాత ఫుడ్ బిజినెస్లోకి వచ్చాడు. 2015లో ‘షకీబ్స్ 75’ (Shakibs 75) పేరుతో రాజధాని ఢాకాలో క్రికెట్ థీమ్ స్పోర్ట్స్ లాంజ్ను ప్రారంభించాడు. షకీబల్ భార్య ఉమ్మీ అమ్మద్ శిశిర్ దగ్గరుండి మరీ ఈ రెస్టారెంట్ను డిజైన్ చేయించింది. వుడెన్ వాల్స్తో డిజైన్ చేసిన భోజనశాలలో నోరూరించే వంటకాలను వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్లో ఐకానిక్ క్రికెట్ స్టేడియాల డిజైన్స్ కూడా కనిపిస్తాయి. షకీబల్ ఫ్యాన్స్ కోసం బంగ్లాదేశ్, కేకేఆర్ టీ షర్టులు, వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఐపీఎల్కు సంబంధించిన స్టంప్స్, బంతులు కూడా ఈ రెస్టారెంటులో ఉన్నాయి.