న్యూఢిల్లీ: ఐపీఎల్లో విఫలమైన సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. ‘క్రికెట్ వదిలేయ్.. వెనక్కి వెళ్లి నీ తండ్రితో పాటు ఆటో నడుపుకో’అనే విమర్శలు వచ్చాయని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడే కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో ధోనీ భయ్యా చెప్పిన మాటతో క్రికెటర్గా నిలబడ్డట్లు తెలిపాడు. అప్పుడు ఎదుర్కొన్న అవమానాలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పోడ్క్యాస్ట్తో సిరాజ్ పంచుకున్నాడు. ‘2019 సీజన్ నాకు కలిసి రాలేదు. కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో రెండు బీమర్లు వేశా. అప్పుడే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా. కానీ కామెంట్లు చేసేవారంతా మేం ఎంత కష్టపడుతున్నామనేది చూడరు. భారత జట్టుకు ఎంపికైన తొలిసారి ధోనీ భయ్యా ఓ మాట చెప్పాడు. మంచి ప్రదర్శన చేసినప్పుడు పొగిడినవాళ్లే.. చెత్త ప్రదర్శన చేసినప్పుడు విమర్శిస్తారు. ఇలాంటివి అతిగా పట్టించుకోవద్దు అని వివరించాడు. ధోనీ చెప్పిందే నిజమైంది. అప్పుడు విమర్శించినవారంతా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు’అని సిరాజ్ వివరించాడు.
నాన్న గర్వించేవారు..
అనంతరం తన తండ్రి గురించి తలచుకుని సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘2020 లో నాన్న అనారోగ్యంతో ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసినప్పుడు మేమిద్దరం ఏడుస్తూనే ఉండేవాళ్లం. దీంతో ఆయనతో తక్కువగా మాట్లాడడం.. మినహా ఇంకేమీ చేయలేని నిస్సహాయుడిని. టెస్టు అరంగేట్రానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన నా ఫొటోలను నాన్న కత్తిరించి భద్రపరుచుకున్నారు. నేను నిలబడి జాతీయ గీతం పాడేప్పుడు ఎంతో గర్వంగా భావించేవారు’అని సిరాజ్ తెలిపాడు.