జౌనపుర్: టీ20 స్పెషలిస్టు హిట్టర్, క్రికెటర్ రింకూ సింగ్ .. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్(Rinku Singh-Priya Saroj)ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అయితే రింకూ, ప్రియా మ్యారేజ్ గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ప్రియా సరోజ్ తండ్రి, ప్రస్తుతం కేరాకట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తుఫానీ సరోజ్ ఆ డౌట్స్ క్లియర్ చేశాడు. రింకూ సింగ్ కుటుంబసభ్యులతో ప్రియా పెళ్లి గురించి మాట్లాడినట్లు తుఫానీ సరోజ్ తెలిపారు. ఓ వార్తా సంస్థతో ఈ విషయాన్ని ఆయన వెల్లడించాడు. రింకూ, ప్రియా పెళ్లి గురించి అలీఘడ్లో రెండు కుటుంబాల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగినట్లు చెప్పారు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్లు తుఫానీ సరోజ్ తెలిపారు.
ఇప్పటి వరకు రింకూ, ప్రియా మధ్య ఉంగరాలు మార్చుకోవడం కానీ, ప్రీ-వెడ్డింగ్ సెర్మనీ జరగలేదన్నారు. ప్రియా స్నేహితురాలి తండ్రి ఓ క్రికెటర్ అని, ఆయన ద్వారా రింకూతో ప్రియాకు పరిచయం ఏర్పడినట్లు తెలిసిందన్నారు. అయితే ఏడాది నుంచి ప్రియా, రింకూ మధ్య స్నేహం ఉన్నట్లు చెప్పారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారని, అయితే కుటుంబ పెద్దల దీవెన కోసం ఎదురుచూవారని, ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు తుఫానీ సరోజ్ తెలిపారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత రింకూ, ప్రియా ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలు వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. లక్నోలో ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలిపారు.
జనవరి 22వ తేదీ నుంచి ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్లో రింకూ సింగ్ ఆడనున్నారు. ఆ తర్వాత అతను ఐపీఎల్ ఆడనున్నాడు. అలీఘడ్లోని ఓజోన్ సిటీలో ఉన్న రింకూ సింగ్ ఇంట్లో పెళ్లి ముచ్చట్లు జరిగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నాయి. వారణాసి సమీపంలోని కర్కియాన్ గ్రామంలో ప్రియా సరోజ్ నివాసం ఉన్నది. సమాజ్వాదీ పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. జౌనపుర్ జిల్లాలోని మచిలీషెహర్ నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
25 ఏళ్ల ప్రియా గతంలో సుప్రీంకోర్టు లాయర్గా చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తన తండ్రి తరపున ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నోయిడాలోని ఆమిటీ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందింది.