CWC | ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా ఈ మెగాటోర్నీలో ఎట్టకేలకు బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాలు చవిచూసిన కంగారూలు.. లంకపై గెలిచి వరల్డ్కప్లో శుభారంభం చేశారు. బౌలింగ్లో జాంపా లంకను వణికిస్తే.. బ్యాటింగ్లో మార్ష్, ఇంగ్లిస్ హాఫ్సెంచరీలతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. పటిష్టమైన పునాది తర్వాత లంకేయులు చేజేతులా మ్యాచ్పై పట్టు కోల్పోయి హ్యాట్రిక్ పరాజయం మూటగట్టుకున్నారు.
లక్నో: ఆస్ట్రేలియాకు ఉపశమనం! ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్కప్లో రెండు పరాజయాల తర్వాత ఆ జట్టు గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. మెగాటోర్నీలో లంకకు ఇది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఒపెనర్లు పాథుమ్ నిషాంక (61; 8 ఫోర్లు), కుషాల్ పెరెరా (78; 12 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి ధాటికి ఒక దశలో 125/0తో అత్యంత పటిష్ట స్థితిలో కనిపించిన లంక.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
వీరిద్దరితో పాటు చరిత అసలంక (25) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. కెప్టెన్ కుషాల్ మెండిస్ (9), సమరవిక్రమ (8), ధనంజయ డిసిల్వా (7), దునిత్ వెల్లాలాగె (2) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జాంపా 4, స్టార్క్, కమిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వర్షం, ఈదురు గాలుల కారణంగా మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. మిషెల్ మార్ష్ (52; 9 ఫోర్లు), ఇంగ్లిస్ (58; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలు నమోదు చేసుకోగా.. లబుషేన్ (40), మ్యాక్స్వెల్ (31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆరంభంలో మంచి బౌలింగ్తో ఆసీస్ను 24/2కు పరిమితం చేసిన లంక అదే ఒత్తిడి కొనసాగించడంలో విఫలమైంది. లంక బౌలర్లలో మధుషనక 3 వికెట్లు పడగొట్టాడు. జాంపాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
గత మ్యాచ్లో ఆరు క్యాచ్లు వదిలేసి అపవాదు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్లో ఒకరకంగా ఫీల్డింగ్తోనే పైచేయి సాధించింది. లంక తొలి వికెట్కు భారీ భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం వార్నర్ అద్భుత క్యాచ్తో కంగారూలకు తొలి వికెట్ అందించగా.. కాసేపటికి కుషాల్ మెండిస్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ను వార్నర్ అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. దీంతో జట్టులో ైస్థెర్యం పెరగగా.. కమిన్స్ కూడా చక్కటి డైరెక్ట్త్రోతో దునిత్ వెల్లలాగేను పెవిలియన్కు పంపాడు.