మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్యాట్ కమ్మిన్స్తో పాటు మరికొంత మంది ఆ దేశ క్రికెటర్లు(Australia Players) ఐపీఎల్లో పూర్తి స్థాయిలో ఆడేందుకు అనుమతి ఇచ్చింది. పాకిస్థాన్తో మే 30వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నది. కానీ కొందరు ఆసీస్ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ఓ ప్రకటన చేసింది. ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ తో పాటు మరికొంత మంది క్రికెటర్లు ఐపీఎల్లోనే కొనసాగనున్నట్లు చెప్పింది. ఐపీఎల్లో లీగ్ దశ మే 24వ తేదీన ముగుస్తుంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ను మే 31వ తేదీన నిర్వహించనున్నారు. అయితే మే 23వ తేదీన ఆస్ట్రేలియా క్రికెటర్లు పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంటుంది.
కానీ కొందరు ఆటగాళ్లకు మినహాయింపు ఇచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. ఇక ఆ జట్టులో ఉన్న ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ .. టోర్నీ ముగిసే వరకు ఆ జట్టుతో ఉండనున్నట్లు తెలిసింది. జోష్ హేజిల్వుడ్, టిమ్ డేవిడ్, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, జ్గావియర్ బార్ట్లెట్, మార్కస్ స్టోయినిస్, కూపర్ కొన్నలీ, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, కెమరూన్ గ్రీన్ కూడా ఐపీఎల్లో ఆడుతున్నారు. ఒకవేళ డీసీ, కేకేఆర్ జట్లు నాకౌట్ దశలోకి వెళ్లకుంటే, అప్పుడు గ్రీన్, స్టార్క్ .. ఐపీఎల్ను వీడే అవకాశాలు ఉంటాయి. ప్లేఆఫ్స్కు లక్నో ప్రవేశించే అవకాశం లేదు. దీంతో ఆ జట్టులో ఉన్న మార్ష్, ఇంగ్లిస్ ప్లేయర్లు పాకిస్తాన్ టూర్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఆడుతున్న ఆసీస్ ప్లేయర్లు ప్లే ఆఫ్స్ వరకు వేచి ఉండాల్సి వస్తుంది.