తన కుటుంబంలో చాలా మంది కరోనా బారినపడటంతో ఐపీఎల్ 2021 బయో బుబుల్లో నిద్రలేని రాత్రులు గడిపినట్లు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ప్రాణాంతక వైరస్పై పోరాటంలో బంధువులకు సహకరించడానికే టోర్నీ మధ్యలోనే ఇంటికి రావాల్సి వచ్చిందని చెప్పాడు. ఐపీఎల్లో అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అశ్విన్ ఇప్పుడు మళ్లీ బబుల్లోకి తిరిగి వచ్చాడు. ఈసారి 104 రోజుల పర్యటనకు భారత జట్టుతో కలిసి జూన్ 2న ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనున్నాడు.
‘నేను దాదాపు 8-9 రోజులు నిద్రపోలేదు. సరిపడా నిద్రలేకపోవడంతో ఒత్తిడిలోనయ్యాను. నిద్రలేకుండానే మ్యాచ్లు ఆడుతున్నాను. నాకు ఇబ్బందిగా అనిపించడంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. వెంటనే ఇంటికి వెళ్లాను. ఆ తర్వాత నేను మళ్లీ టోర్నీలో ఆడగలనా అనిపించింది. కానీ అప్పుడు ఆ సమయానికి అవసరమైనదే నేను చేశానని’ అశ్విన్ ఓ యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. ఐపీఎల్ బయో-బబుల్లో పలువురు ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా సోకడంతో లీగ్ను వాయిదా వేశారు.