దుబాయ్: ఐసీసీ జూన్ నెలకుగాను మెన్స్, వుమెన్స్ క్రికెట్లో ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ను ప్రకటించింది. వుమెన్స్ క్రికెట్లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా రేసులో ఉన్నా కూడా.. వాళ్లను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్స్టోన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలవగా.. ఇటు మెన్స్ క్రికెట్లో న్యూజిలాండ్ ఓపెనర్ డెవోన్ కాన్వే ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకోబోతున్న రెండో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్గా ఎకిల్స్టోన్ నిలిచింది. ఇండియాతో జరిగిన ఏకైక టెస్ట్లో ఆమె 8 వికెట్లు తీసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో మూడేసి వికెట్లు తీయడం విశేషం.
టెస్ట్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్లోనే 96, 63 పరుగులు చేసిన ఇండియన్ డాషింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ.. ఈ అవార్డుకు నామినేట్ అయినా కూడా విజేతగా నిలవలేకపోయింది. ఇక ఇదే టెస్ట్లో రెండో ఇన్నింగ్స్లో కీలకమైన 80 పరుగులు చేసి మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించిన స్నేహ్ రాణాకు కూడా అవార్డు దక్కలేదు. ఇక మెన్స్ క్రికెట్లో ఈ అవార్డు అందుకున్న తొలి న్యూజిలాండ్ ప్లేయర్గా కాన్వే నిలిచాడు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో డబుల్ సెంచరీతోపాటు తర్వాత రెండు టెస్టుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన కాన్వేకు పెద్దగా పోటీ లేకపోయింది.