కామన్వెల్త్లో భారత మల్లయోధులు పతకాల పట్టుపట్టారు. డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్ పునియా పసిడి పతకంతో మెరువగా.. మహిళల విభాగంలో సాక్షి మాలిక్ స్వర్ణం కైవసం చేసుకుంది. ఉడుం పట్టుతో మ్యాట్పై విశ్వరూపం కనబరుస్తూ.. బజరంగ్ ప్రత్యర్థిని మట్టికరిపిస్తే.. ఆరంభంలో వెనుకబడ్డట్లు కనిపించిన మాలిక్ శివంగిలా విజృంభించి అగ్రస్థానం కైవసం చేసుకుంది. పాకిస్థాన్ రెజ్లర్ను చిత్తు చేసి దీపక్ పునియా పసిడి కాంతులు విరజిమ్మితే.. అన్షు మాలిక్ రజతంతో సరిపెట్టుకుంది. పోటీల ఆరంభంలో లిఫ్టర్లు దుమ్మురేపితే.. శుక్రవారం రెజ్లర్లు సత్తాచాటారు. లాంగ్జంప్లో మురళీ శ్రీశంకర్ రజతంతో నయా రికార్డు సృష్టిస్తే.. పారా పవర్లిఫ్టింగ్లో సుధీర్ బంగారు పతకంతో మెరిశాడు.
బర్మింగ్హామ్: మ్యాట్పై మన రెజ్లర్లు వీరవిహారం చేయడంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు కొనసాగింది. శుక్రవారం ఒక్క రోజే ముగ్గురు రెజ్లర్లు స్వర్ణాలు కైవసం చేసుకోగా.. మరో రజతం మన ఖాతాలో చేరింది. పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్ పునియా స్వర్ణం చేజిక్కించుకోగా.. మహిళల 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ పసిడి కాంతులు విరజిమ్మింది. దివ్య (68 కేజీలు), మెహిత్ (125 కేజీలు) కాంస్యాలు గెలుచుకున్నారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ పునియా.. పూర్తి ఆధిపత్యంతో విజేతగా నిలిచాడు. బరిలోకి దిగిన నాలుగు బౌట్లలో మూడింట తొలి రౌండ్లోనే బజరంగ్ విజేతగా నిలిచాడు. ఏడాది కాలంగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న బజరంగ్.. శుక్రవారం పోటీల్లో ప్రత్యర్థుల పాలిట సంహిస్వప్నంలా నిలిచాడు. ఫైనల్లో బజరంగ్ 9-2తో మెక్నిల్ (కెనడా)పై ఘనవిజయం సాధించాడు.
పుట్టిన రోజు నాడే..
తొలిసారి కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగిన అన్షు మాలిక్ రజత పతకం ఖాతాలో వేసుకుంది. సంపూర్ణ ఆధిపత్యంతో 57 కేజీల ఫైనల్ చేరిన అన్షు.. తుదిపోరులో తడబడింది. ఫైనల్లో అన్షు 3-7తో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు సైమోనిడిస్పై టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా నెగ్గిన అన్షు.. శ్రీలంక రెజ్లర్ నెథామీ ఫెర్నాండోనూ కూడా చిత్తు చేసింది. తన ట్రేడ్మార్క్ పట్లతో మంచి ప్రదర్శన కనబర్చిన అన్షు.. ఫైనల్లో ఆకట్టుకోలేకపోయింది. ప్రత్యర్థి అన్షు కంటే ఎక్కువ ఎత్తు ఉండటం ఆమెకు శరాఘాతంలా మారింది. పుట్టిన రోజు (శుక్రవారం) నాడు పసిడి కాంతులు విరజిమ్మాలనుకున్న అన్షు.. రెండో స్థానంలో నిలువడంతో కన్నీటితో మ్యాట్ను వీడింది.
దీపక్ ధనాధన్
పురుషుల 86 కేజీల విభాగంలో దీపక్ పునియా పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో దీపక్.. మహమ్మద్ ఇనామ్ (పాకిస్థాన్)పై విజయం సాధించాడు. ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా ఫైనల్ చేరిన పునియా.. తుది పోరులోనూ అదే జోరు కనబర్చాడు. బౌట్ ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థిని రింగ్ నుంచి బయటకు నెట్టి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్న దీపక్.. రెండో రౌండ్లో ఇనామ్ను మ్యాట్పై పడేసి టెక్నికల్ ఆధిక్యంతో బౌట్ చేజిక్కించుకున్నాడు.
శ్రీశంకర్కు రజతం
భారీ అంచనాల మధ్య బర్మింగ్హామ్ బరిలోకి దిగిన భారత లాంగ్జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్.. కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోటీల్లో శ్రీశంకర్ 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ లాంగ్జంప్లో భారత్కు ఇదే తొలి రజతం కావడం విశేషం. గతంలో (1978) సురేశ్ బాబు ఈ విభాగంలో కాంస్యం కైవసం చేసుకున్నాడు. లాక్వాన్ నైర్న్ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. నైర్న్ కూడా శ్రీశంకర్తో సమానంగా 8.08 మీటర్ల దూరమే గెంతినా.. అతడి రెండో అత్యుత్తమ జంప్ (7.98 మీ).. శ్రీశంకర్ (7.84) కంటే మెరుగ్గా ఉండటంతో అతడికి పసిడి దక్కింది. దక్షిణాఫ్రికాకు చెందిన జొవన్ వాన్ (8.06 మీ) కాంస్యం గెలుచుకున్నాడు. ఇదే విభాగంలో పోటీ పడ్డ భారత అథ్లెట్ మహమ్మద్ అనీస్ యహియా (7.97మీ) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజా సీజన్లో మంచి దూకుడు మీదున్న శ్రీశంకర్ ఫేవరెట్గా బరిలోకి దిగి తొలి నాలుగు ప్రయత్నాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు లంఘించి రెండో ప్లేస్కు చేరాడు. ఇక చివరి ప్రయత్నంలో అతడు మరోసారి ఎనిమిది మీటర్ల మార్క్ దాటినా.. అది ఫౌల్ కావడంతో శ్రీశంకర్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శ్రీశంకర్ తల్లిదండ్రులు కూడా అథ్లెట్లే కాగా.. లాంగ్జంప్లో దేశానికి తొలి రజతం అందించిన అతడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.
సాక్షి సౌరభం
మహిళల 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ అదరగొట్టింది. ఆరంభంలోనే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చి ఒత్తిడిలో పడ్డట్లు కనిపించిన సాక్షి.. రెండో రౌండ్లో విశ్వరూపం కనబరుస్తూ.. ప్రత్యర్థిని మట్టి కరిపించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాక్షి.. అనా పాల్ గొడింజ్ (కెనడా)పై టెక్నికల్ ఆధిపత్యంతో విజయం సాధించింది. ఫైనల్లో మాత్రమే ప్రత్యర్థికి కాస్త అవకాశం ఇచ్చిన సాక్షి.. అంతకుముందు జరిగిన బౌట్లలో బర్న్స్ (ఇంగ్లండ్), బెర్త్ ఎమిలినె (కామెరూన్)పై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. కామన్వెల్త్ క్రీడల్లో మాలిక్కు ఇదే తొలి స్వర్ణం కాగా.. అంతకుముందు ఆమె రజత, కాంస్యాలు గెలుచుకుంది.
సుధీర్కు స్వర్ణం పారా పవర్ లిఫ్టింగ్
కామన్వెల్త్ పారా పోటీల్లో భారత్ ఖాతా తెరిచింది. పవర్లిఫ్టింగ్లో సుధీర్ స్వర్ణం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోటీల్లో సుధీర్ 212 కేజీల బరువెత్తి.. 134.5 పాయింట్లతో కామన్వెల్త్ రికార్డు బ్రేక్ చేస్తూ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. చిన్నప్పుడే పోలియో బారిన పడి చక్రాల కుర్చీకే పరిమితమైన 27 ఏండ్ల సుధీర్ రెండో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. పారా లిఫ్టింగ్లో సత్తాచాటిన సుధీర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.