సీఎం కప్ క్రీడాభిమానులను అలరిస్తున్నది. యువతీ యువకుల సమ్మేళనంతో వివిధ క్రీడాంశాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మండల, జిల్లా స్థాయి పోటీలకు కొనసాగింపుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి టోర్నీ అంచనాలకు మించి సాగుతున్నది. నగరంలోని ఆరు క్రీడా మైదానాల్లో వేర్వేరు క్రీడాంశాల్లో ప్లేయర్లు హోరాహోరీగా తలపడుతున్నారు. సత్తాచాటడమే లక్ష్యంగా దూసుకెళుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ పతకాలు కొల్లగొట్టేందుకు సై అంటున్నారు. ఆదివారం వేర్వేరు స్టేడియాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పోటీలను ప్రారంభించి ప్లేయర్లలో జోష్ నింపారు.
సీఎం కప్ క్రీడా టోర్నీ ఒక పండుగ వాతావరణంలో సాగుతున్నది. స్వల్ప వ్యవధిలోనే రూపుదిద్దుకున్న టోర్నీకి అన్ని వైపుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. మండల, జిల్లా స్థాయి పోటీల్లో పెద్ద ఎత్తున ప్లేయర్లు పోటీపడగా, ప్రతిభ చాటిన వారు రాష్ట్ర స్థాయిలోనూ మెరిసేందుకు తహతహలాడుతున్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం, సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియం, జింఖానా మైదానం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ షూటింగ్ రేంజ్ వేదికలుగా మొత్తం 18 క్రీడాంశాల్లో 33 జిల్లాలకు చెందిన ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఆదివారం టీమ్ ఈవెంట్లు అయిన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్ పోటీలు మొదలయ్యాయి. ఎల్బీ స్టేడియంలో హ్యాండ్బాల్ పోటీలను క్రీడా, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు ప్లేయర్లతో కలిసి మంత్రి హ్యాండ్బాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో టోర్నీని నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలో స్టేడియాలను కూడా ప్రారంభించబోతున్నాం. వివి ధ జిల్లాల నుంచి ప్లేయర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఎదగాలి. సీఎం కప్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్లు, కోచ్లకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని అన్నారు.
ఆదివారం ఉదయం సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ జింఖానా మైదానంలో ఖో ఖో పోటీలను ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత నెల రోజుల నుంచి యావత్ తెలంగాణ మొత్తం క్రీడా ప్రాంగణాలు ఆటపోటీలతో కళకళలాడుతూ జాతరలను తలపిస్తున్నాయి. వివిధ గ్రామాలు, జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం అద్భుత అవకాశం. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద యువ క్రీడా సంబురం. సీఎం కప్ పోటీలను క్రీడా ప్రేమికులు వీక్షించి ప్లేయర్లను ప్రోత్సహించాలి’ అని అన్నారు. మరోవైపు యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియం, సరూర్నగర్ స్టేడియాల్లో జరిగిన పోటీలను సాట్స్ చైర్మన్ పరిశీలించారు. ప్లేయర్లతో కలిసి భోజనం చేసిన ఆయన స్వయంగా వడ్డించారు.
తొలి రోజు పోటీలను ఒక్కో స్టేడియంలో ఒక్కొక్కరు ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియంలో హాకీ పోటీలను క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ప్రారంభించారు. మరోవైపు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, రెజ్లింగ్ పోటీలను సాట్స్ ఓఎస్డీ లక్ష్మి ప్రారంభించారు.
ఎల్బీ స్టేడియంలో సోమవారం సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వీరితో పాటు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. సాట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీ ఆరంభ వేడుకల్లో అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించనున్నారు. దీనికి తోడు 33 జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్లేయర్లతో మార్చ్ఫాస్ట్ నిర్వహించనున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సమన్వయంతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అందరినీ అలరించనున్నారు.