IPL-2023 | మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్ గెలుచుకోవడంతో ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్ స్పిన్ బౌలర్లు.. సీఎస్కే బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేశారు. ఆరో ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు మధ్య సీఎస్కే బ్యాటర్లు ఒకే ఒక్క బంతిని మాత్రమే బౌండరీకి పంపగలిగారంటే పిచ్ బౌలర్లకు ఎంత అనుకూలంగా ఉందో కనిపిస్తున్నది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ ప్రస్తుత టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అతి తక్కువ స్కోర్ ఇదే.
కేవలం 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న సీఎస్కేను శివం దూబె ఆదుకున్నాడు. 34 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ (17), డెవాన్ కాన్వే (30), అజ్యింకా రహానే (16), రవీంద్ర జడేజా (20) పరుగులు చేసినా అంబటి రాయుడు నాలుగు పరుగులే చేసి నిరాశ పరిచాడు. ఇక కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నరైన్ చెరో రెండు, వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు.