దుబాయ్: ఐపీఎల్ 14 తొలి క్వాలిఫైయర్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సూపర్ విక్టరీ సాధించింది. చెన్నై సారధి మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్ను తనదైన స్టైల్లో ముగించి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ మ్యాచ్లో ధోనీ మామూలు కన్నా ఒక స్థానం ముందే బ్యాటింగ్కు వచ్చాడు. ఫామ్లో ఉన్న జడేజాను కాదని ధోనీని పంపడంపై చెన్నై జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. బ్యాటింగ్కు దిగే సమయంలో ధోనీ కళ్లలో కసి కనపడిందని, అలాంటి సమయంలో అతన్ని తాను ఆపడం జరగదని ఫ్లెమింగ్ చెప్పాడు.
‘‘కెప్టెన్ కళ్లలో ఆ చూపు చూసిన తర్వాత, అదీ అంతకు ముందు అతను అలా ఉన్నప్పుడు ఏం చేశాడో తెలిసి.. బ్యాటింగ్కు వెళ్తానంటే అతన్ని ఆపను, ఆ ఫలితం కనిపించింది కదా’’ అని ఫ్లెమింగ్ అన్నాడు. అలాగే ఈ మ్యాచ్ సమయంలో ధోనీ తనతో ఎన్నో సాంకేతిక అంశాల గురించి చర్చించినట్లు చెన్నై కోచ్ వెల్లడించాడు. ఇప్పటి వరకూ తామిద్దరం మాట్లాడుకున్న దానికన్నా చెన్నై బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలోనే తాము ఎక్కువగా మాట్లాడుకున్నామని అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా, కెప్టెన్ రిషభ్ పంత్ అర్థసెంచరీలతో చెలరేగడంతో 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు 172 పరుగులు చేసింది. అయితే చెన్నై బ్యాట్స్మెన్లలో రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప 110 పరుగుల భాగస్వామ్యంతో లక్ష్యఛేదనను ముందుకు నడిపించారు. చివర్లో దిగిన ధోనీ ధనాధన్ షాట్లతో 6 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.