IPL | కండ్లు చెదిరే సిక్సర్లు.. దుమ్మురేపే బౌండ్రీలు.. అబ్బుర పరిచే క్యాచ్లతో మండు వేసవిలో పరుగుల విందు పంచిన ఐపీఎల్ అదే స్థాయి ఫినిషింగ్ టచ్తో ముగిసింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన పోరులో చివరకు ధోనీ సేనదే పైచేయి అయింది. వరుణుడి ఆటంకం మధ్య సాగిన పోరులో చెన్నై విజయానికి చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా.. రవీంద్ర జడేజా 6,4తో సూపర్ కింగ్స్ను సంబురాల్లో ముంచెత్తాడు. రెండు రోజులుగా తుదిపోరు కోసం చకోర పక్షుల్లా ఎదురుచూసిన ధోనీ అభిమానులు ఈ ఫలితంతో ఆనంద డోలికల్లో మునిగిపోగా.. చెమర్చిన కండ్లతో అంబటి రాయుడు కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఇది ఐపీఎల్లో చెన్నైకి ఐదో టైటిల్ కాగా.. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టైటాన్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది!
అహ్మదాబాద్: రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ధోనీ సేన దుమ్మురేపింది. వరుణుడి ఆటంకం మధ్య డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలిన పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించింది. తద్వారా ఐపీఎల్లో ఐదో టైటిల్ నెగ్గి.. ముంబై ఇండియన్స్ను సమం చేసింది. వర్షం కారణంగా ఆదివారం జరుగాల్సిన మ్యాచ్ సోమవారానికి వాయిదా పడగా.. రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్ను వరుణుడు వదల్లేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్ధిమాన్ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకం నమోదు చేసుకున్నాడు.
ఫుల్ ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) వికెట్ల వెనుక ధోనీ చేసిన మెరుపు స్టంపింగ్తో పెవిలియన్ బాట పట్టాడు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్సర్లు) కొన్ని విలువైన పరుగులు చేశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై తొలి ఓవర్ ఆడుతున్న సమయంలో వర్షం ముంచెత్తింది. దీంతో మ్యాచ్కు ఆటంకం కలిగింది. అరగంట అనంతరం వరుణుడు తెరిపినిచ్చినా.. ఔట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యేందుకు ఎక్కువ సమయం పట్టింది. అర్ధర్రాతి 12.10 గంటల సమయంలో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171గా నిర్ణయించారు. దీంతో ఆరంభం నుంచే దంచికొట్టిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దూబే (21 బంతుల్లో 32 నాటౌట్; 2 సిక్సర్లు), గైక్వాడ్ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; ఒక ఫోర్, 2 సిక్సర్లు), జడేజా (6 బంతుల్లో 15 నాటౌట్, ఒక ఫోర్, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు.
సుదర్శన్ సుడిగాలి ఇన్నింగ్స్
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టైటాన్స్కు శుభారంభం దక్కింది. గత నాలుగు ఇన్నింగ్స్ల్లో మూడు సెంచరీలతో అరవీర భయంకర ఫామ్లో ఉన్న గిల్ కోసం.. ప్రత్యర్థులు వ్యూహాలు సిద్ధం చేసుకోగా.. సీనియర్ వికెట్ కీపర్ సాహా చాపకింద నీరులా పరుగులు రాబట్టాడు. దీపక్ వేసిన మూడో ఓవర్లో 6,4,4 కొట్టిన సాహా ఇన్నింగ్స్కు ఊపుతెస్తే.. దేశ్పాండేకు గిల్ హ్యాట్రిక్ ఫోర్లు రుచి చూపించాడు. తీక్షణ ఓవర్లోనూ గిల్ హ్యాట్రిక్ ఫోర్లు దంచడంతో పవర్ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి టైటాన్స్ 62/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో స్పిన్నర్లను రంగలోకి దింపిన ధోనీ ఫలితం రాబట్టాడు. జడేజా బౌలింగ్లో క్రీజుకు కాస్త ముందు నిల్చొన్న గిల్.. ధోనీ చేసిన రాకెట్ స్టంపింగ్కు వికెట్ సమర్పించుకున్నాడు.
ఆరంభంలో సుదర్శన్ నెమ్మదిగా ఆడటంతో గుజరాత్ స్కోరుకు కళ్లెం పడింది. ఫలితంగా 10 ఓవర్లలో పాండ్యా సేన వికెట్ నష్టానికి 86 రన్స్ చేసింది. కుదురుకున్నాక సుదర్శన్ వేగం పెంచగా.. అర్ధశతకం అనంతరం గిల్ పెవిలియన్ చేరాడు. తీక్షణ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించిన సుదర్శన్.. పతిరణ ఓవర్లో రెండు ఫోర్లు అరుసుకున్నాడు. 17వ ఓవర్లో 6,4,4,4 దంచిన సుదర్శన్ చివరి ఓవర్ తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు. అదే ఊపులో సెంచరీ ఖాయమనుకుంటే.. పతిరణ ఔలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఒక దశలో 25 బంతుల్లో 36 పరుగులతో నిలిచిన సుదర్శన్.. తర్వాతి 21 బంతుల్లో 60 రన్స్ రాబట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 214/4 (సుదర్శన్ 96, సాహా 54; పతిరణ 2/44, జడేజా 1/38),
చెన్నై: (లక్ష్యం 15 ఓవర్లలో 171) 171/5 (కాన్వే 47, దూబే 32 నాటౌట్; మోహిత్ 3/36, నూర్ 2/17).