Virushka : పెళ్లి రోజు ఎవరికైనా ప్రత్యేకమే. ఆ రోజు తమ పెళ్లి నాటి జ్ఞాపకాలు, ఫొటోల్నిచాలామంది గుర్తుచేసుకుంటారు. బాలీవుడ్ హీరోయిన అనుష్కా శర్మ కూడా తన పెళ్లి రోజు సందర్భంగా సోషల్ మీడియాలో భర్త విరాట్ కోహ్లీతో ఉన్న ఆరు ఫొటోలు పెట్టింది. విరాట్ కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకొని ఇవాళ్టికి ఐదేళ్లు. దాంతో, అనుష్క ఇన్స్టాగ్రామ్లో మీమ్స్, ఫొటోలు షేర్ చేసింది. ‘మా ప్రేమ గుర్తులైన ఫొటోలు షేర్ చేసి, సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ రోజు కంటే మంచి రోజు మరొకటి లేదు’ అంటూ అనుష్క రాసుకొచ్చింది. అంతేకాదు ప్రతి ఫొటో కింద క్యాప్షన్ ఉంది. అందులో పురిటి నొప్పుల సమయంలో అనుష్కను ఆస్పత్రికి తీసుకొచ్చిన మరునాడు కోహ్లీ అక్కడే ఒక బెడ్ మీద కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో కూడా ఉంది. ‘చీర్స్ టు అజ్, మై లవ్ టుడే, టుమారో, ఫరెవర్’ అంటూ అనుష్క పోస్ట్లో రాసింది. అనుష్క పోస్ట్పై కోహ్లీ కూడా ఆసక్తికరంగా స్పందించాడు.
‘నా జీవితంలో గుర్తుంచుకోదగ్గ ఫొటోలు నీ దగ్గర కచ్చితంగా ఉంటాయి’ అని కోహ్లీ కామెంట్ చేశాడు. అంతేకాదు కోహ్లీ కూడా అనుష్కతో కలిసి దిగిన కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘కలకాలం సాగే ప్రయాణంలో ఐదేళ్లు. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను’ అంటూ కింగ్ కోహ్లీ అనుష్కపై తన ప్రేమను వెల్లడించాడు. విరాట్, అనుష్క ఐదేళ్ల క్రితం ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీళ్లకు వామిక అనే కూతురు ఉంది.