అమరావతి : మెల్బోర్న్లో ( Melbourne) భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్ ( Cricket ) మ్యాచ్లో మొదటి ఇన్నింగ్లో శనివారం మూడో రోజు సెంచరీ (Century) చేసిన విశాఖ కుర్రాడు నితీష్రెడ్డిని (Nitish Reddy) ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్(ఏసీఏ) అభినందిస్తూ నజరానా ప్రకటించింది.
ఏసీఏ తరుఫున రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందజేస్తామని ఏసీఏ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (MP Shivnath) ప్రకటించారు.త్వరలోనే సీఎం చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని వెల్లడించారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు . ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ ఉండేలా ఏసీఏ ఆలోచన చేస్తోందని అన్నారు.
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును నితీష్రెడ్డిఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. ఆల్రౌండర్లు జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదుచేశాడు.
ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీశ్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నితీష్రెడ్డి 104 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.