టీ20 ప్రపంచకప్ విజయం.. ఆ తర్వాత జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్పై పూర్తి ఆధిపత్యం.. ఇంత చేసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచానికి పెద్ద షాకిచ్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
పలువురు మాజీలు కూడా బోర్డును తప్పుబట్టారు. అయితే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ వరకు లాంగర్ పదవీకాలన్ని పొడిగిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదన చేసిందని, కానీ లాంగర్ దాన్ని స్వీకరించలేదని బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలో మిచెల్ జాన్సన్ వంటి మాజీలు టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను విమర్శించారు. లాంగర్కు కమిన్స్ మద్దతుగా నిలవాల్సిందని వాళ్లు ఆరోపించారు.
2018లో బాల్ ట్యాంపరింగ్ కారణంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్పై ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోచ్ బాధ్యతలు చేపట్టిన లాంగర్.. జట్టును కష్టాల నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో కమిన్స్పై విమర్శల నేపథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియా టెస్టు జట్టులో పునరాగమనం చేసిన ఉస్మాన్ ఖవాజా స్పందించాడు.
‘లాంగర్ విషయంలో టెస్టు కెప్టెన్ కమిన్స్ లేదా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఫించ్.. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలకు ఫుల్స్టాప్ పెట్టడానికి అదొక్కటే మార్గం’ అని ఖవాజా అన్నాడు. జట్టులో వినయాన్ని పెంపొందించడంలో లాంగర్ చాలా కష్టపడ్డాడని చెప్పాడు. లాంగర్ రాకముందు తాను జట్టుకు ఆడానని, లాంగర్ వచ్చాక కూడా ఆడానని, కాబట్టి జట్టులో అతను తెచ్చిన మార్పు తనకు స్పష్టంగా కనిపించిందని వివరించాడు.