బౌలింగ్లో కుల్చా జోడీ లంకేయుల జోరుకు అడ్డుకట్ట వేస్తే.. బ్యాటింగ్లో పృథ్వీ, కిషన్ల జంట వారిని ఓ ఆటాడుకుంది. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అన్నట్లు ఎదురుచూస్తున్న భారత సింహాల బృందానికి లంక బౌలర్లు లేడి పిల్లల్లా దొరికారు. దీంతో బౌండ్రీలు, సిక్సర్లే లక్ష్యంగా మనవాళ్లు విరుచుకుపడ్డారు. ఆడుతుంది వన్డేనా.. టీ20నా అన్న తరహాలో దంచికొట్టిన యంగ్ ఇండియా తొలి వన్డేలో జయభేరి మోగించింది.
కొలంబో: బౌలర్ల క్రమశిక్షణకు టాపార్డర్ మెరుపులు తోడవడంతో భారత్ బోణీ కొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యంగ్ టీమ్ఇండియా శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. చమిక కరుణరత్నె (43 నాటౌట్) టాప్స్కోరర్. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో టాపార్డర్ విజృంభించడంతో భారత్ 36.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 263 పరుగులు చేసింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) మెరుపులకు ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉరుములు తోడవగా.. కెప్టెన్ శిఖర్ ధావన్ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్కు ఇరుసులా నిలిచాడు. తన సునామీ ఇన్నింగ్స్తో లంక బౌలర్లను బెంబేలెత్తించిన పృథ్వీ షాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే రెండో వన్డే జరుగనుంది.
పృథ్వీ, ఇషాన్ తొలి 15 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేశారు. నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో నిల్చొని యువ ఆటగాళ్ల జోరు చూస్తుంటే ముచ్చటేసింది. వారి ఆటలో ఎంతో పరిణితి కనిపించింది. ఇది జట్టు విజయం. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో ఆరంభంలోనే వారికి బంతినిచ్చాం. అది మంచి ఫలితాన్నిచ్చింది. కుల్దీప్, చాహల్, కృనాల్ చక్కటి బంతులేశారు.
స్కోరు బోర్డు
శ్రీలంక: అవిష్క (సి) పాండే (బి) చాహల్ 33, భానుక (సి) పృథ్వీ (బి) కుల్దీప్ 27, రాజపక్స (సి) ధావన్ (బి) కుల్దీప్ 24, ధనంజయ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 14, చరిత (సి) ఇషాన్ (బి) దీపక్ 38, షనక (సి) హార్దిక్ (బి) చాహల్ 39, హసరంగ (సి) ధావన్ (బి) దీపక్ 8, చమిక (నాటౌట్) 43, ఉడాన (సి) దీపక్ (బి) హార్దిక్ 8, దుష్మంత చమీర (రనౌట్/భువనేశ్వర్) 13, ఎక్స్ట్రాలు: 15, మొత్తం: 50 ఓవర్లలో 262/9. వికెట్ల పతనం: 1-49, 2-85, 3-89, 4-117, 5-166, 6-186, 7-205, 8-222, 9-262, బౌలింగ్: భువనేశ్వర్ 9-0-63-0, దీపక్ 7-1-37-2, హార్దిక్ 5-0-34-1, చాహల్ 10-0-52-2, కుల్దీప్ 9-1-48-2, కృనాల్ 10-1-26-1.
భారత్: పృథ్వీషా (సి) ఫెర్నాండో (బి) ధనంజయ 43, ధావన్ (నాటౌట్) 86, ఇషాన్ (సి) భానుక (బి) సందకన్ 59, పాండే (సి) షనక (బి) ధనంజయ 26, సూర్యకుమార్ (నాటౌట్) 31, ఎక్స్ట్రాలు: 18, మొత్తం: 36.4 ఓవర్లలో 263/3. వికెట్ల పతనం: 1-58, 2-143, 3-215, బౌలింగ్: చమీర 7-0-42-0, ఉడాన 2-0-27-0, ధనంజయ 5-0-49-2, సందకన్ 8.4-0-53-1, అసలంక 3-0-26-0, హసరంగ 9-1-45-0, చమిక 2-0-16-0
2 భారత్ తరఫున అరంగేట్ర టీ20, వన్డే మ్యాచ్ల్లో హాఫ్సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. రాబిన్ ఊతప్ప ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు.
14 అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు (261 ఇన్నింగ్స్ల్లో) పూర్తి చేసుకున్న 14వ భారత ఆటగాడిగా ధావన్ నిలిచాడు.
57/0 వన్డేల్లో తొలి 5 ఓవర్లలో భారత్ చేసిన అత్యధిక పరుగులివే. 2020 సిడ్నీలో ఆస్ట్రేలియాపై చేసిన 53/0 స్కోరు రెండో స్థానానికి చేరింది.
2 అరంగేట్ర వన్డేలో తక్కువ బంతుల్లో (33) అర్ధశతకం చేసిన ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. కృనాల్ పాండ్యా (ఇంగ్లండ్పై 26 బంతుల్లో) టాప్లో ఉన్నాడు.
2 విరాట్ కోహ్లీ (136 ఇన్నింగ్స్ల్లో)తర్వాత అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా ధావన్ (140 ఇన్నింగ్స్ల్లో) నిలిచాడు. గంగూలీ (147 ఇన్నింగ్స్ల్లో) మూడో స్థానంలో ఉన్నాడు.
కిషన్, సూర్య అరంగేట్రం..
ఈ మ్యాచ్ ద్వారా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్.. మిడిలార్డర్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశారు. ఇటీవల టీ20 జట్టులో చోటు దక్కించుకొని అదరగొట్టిన ఈ ఇద్దరూ ఆదివారం పోరులోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యం గా బర్త్డే బాయ్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పృథ్వీ షా పెవిలియన్చేరడంతో వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కిషన్ ఎదుర్కొన్న తొలి బంతికే భారీ సిక్సర్ బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. మరుసటి బంతికి బౌండ్రీ బాదిన ఈ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్.. ధనంజయ డిసిల్వా బౌలింగ్లో హ్యాట్రిక్ బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. ఇదే జోరులో అరంగేట్ర మ్యాచ్లోనే అర్ధశతకం నమోదు చేసుకున్న కిషన్.. కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. ఇన్నింగ్స్ ఆఖర్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ తన క్లాసిక్ షాట్లతో కట్టి పడేశాడు. హసరంగ ఓవర్లో వరుసగా మూడు సార్లు బంతిని బౌండ్రీ దాటించిన సూర్యకుమార్.. ఐపీఎల్లో తనకు అలవాటైన శైలిలో మ్యాచ్ను ముగించాడు.