Kohli – Bear Grylls : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli), త్వరలోనే టీవీ షోలో కనిపించనున్నారు. అది కూడా సాహసాలతో కూడిన ఎపిసోడ్లో. అవును… సాహసవంతుడిగా వరల్డ్ ఫేమస్ అయిన బ్రిటన్ సాహసి బేర్ గ్రిల్స్(Bear Grylls) తన తర్వాతి ఎపిసోడ్ను కోహ్లీ తో ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్నిఅతను తాజాగా వెల్లడించాడు. అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్ చోప్రా(Priyanka Chopra)తో కూడా అడ్వెంచర్ ఎపిసోడ్ తీయాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పాడు.
‘కోహ్లీ, ప్రియాంక చోప్రా.. ఇద్దరూ కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమనులున్నారు. ఆటతో, సినమాలతో పాపులర్ అయిన ఈ ఇద్దరితో త్వరలోనే కొత్త ఎపిసోడ్ తీయాలనుకుంటున్నా. అయితే.. ఇప్పటివరకు కోహ్లీ, ప్రియాంక పాల్గొనేది? లేనిది? మేము వెల్లడించలేదు. ప్రస్తుతమైతే వాళ్లతో మా టీమ్ చర్చలు జరుపుతోంది. వాళ్లు ఓకే చెప్తారని నేను చాలా నమ్మకంతో ఉన్నా. ఈ సెలబ్రిటీల జీవితం గురించి మరింతగా తెలుసుకోడాన్ని నాతో పాటు ప్రతిఒక్కరు గొప్ప గౌరవంగా భావిస్తారు’ అని బేర్ గ్రిల్స్ తెలిపాడు. అతను గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ హీరోలు రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్తో అడ్వెంచర్ ట్రిప్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.
మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో బేర్ గ్రిల్స్
బేర్ గ్రిల్స్ మొదట్లో అడ్వెంచర్గా ప్రయాణం మొదలెట్టాడు. ఆ సమయంలో అతను ఎన్నో వన్యమృగాలు, జలచరాలను చూశాడు. వాటి జీవనశైలి మీద ఆసక్తితో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్'(Man vs. Wild) అనే టీవీ సిరీస్ నడిపాడు. అందులో వింత జంతువులు, వాటి తిండి, ఆవాసం గురించి చెప్పేవాడు. అంతేకాదు అడవిలో మనుషులు తినదగ్గ వాటిని కూడా వివరించేవాడు. ఆ సిరీస్ గ్రిల్స్ ఊహించిన దానికంటే బాగా హిట్ అయింది. దాంతో, మనోడి పేరు మార్మోగిపోయింది.