భోపాల్: జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల తొలి పోరులో తమిళనాడుకు చెందిన అభినయపై నిఖత్ ఏకపక్షంగా విజయం సాధించింది. ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో నిఖత్ చెమట పట్టకుండానే గెలుపొందింది. ప్రపంచ చాంపియన్ జోరు ముందు అభినయ నిలువలేకపోవడంతో రెఫరీలు నిఖత్ను విజేతగా ప్రకటించారు. గురువారం జరుగనున్న ప్రిక్వార్టర్స్లో ఇవా (మేఘాలయ)తో నిఖత్ తలపడనుంది. ఇతర బౌట్లలో సిమ్రన్జీత్ కౌర్ (60 కేజీలు), మంజు రాణి (48 కేజీలు), సవీటి బోరా (81 కేజీలు) విజయాలతో ముందంజ వేయగా.. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై (75 కేజీలు)కు తొలి రౌండ్లో బై లభించింది.