‘పటాస్’ ‘ఎఫ్-2’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అనిల్రావిపూడి. ప్రస్తుతం ఆయన ‘ఎఫ్-3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ కార్యరూపం దాల్చబోతున్నదని తెలిసింది. ఇటీవలే అనిల్ రావిపూడి చెప్పిన కథకు బాలకృష్ణ ఓకే చేశారని తెలిసింది. కథలోని శక్తివంతమైన అంశాలు, తన పాత్ర చిత్రణలోని కొత్తదనం నచ్చడంతో సినిమాకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలిసింది. షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్పెద్ది ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.