పూణె: ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నో బాల్స్ వేయడం నేరమే అవుతుందని టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అభిప్రాయపడ్డారు. శ్రీలంకతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో ఇండియన్ బౌలర్లు భారీగా నో బాల్స్ సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా ఏడు నోబాల్స్ వేసింది. దాంట్లో హర్షదీప్ అయిదు నోబాల్స్ వేశాడు. ఒక రకంగా ఇండియా ఓటమికి ఇదో కారణం అని కూడా చెప్పవచ్చు. హర్షదీప్ కేవలం రెండు ఓవర్లలోనే అయిదు నోబల్స్ వేశాడు. అతను 37 రన్స్ సమర్పించుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ పాండ్యా దీనిపై మాట్లాడుతూ.. ఒక రోజు మంచిగా ముగుస్తుందని, మరో రోజు చెడుగా ముస్తుందని, కానీ బేసిక్స్ నుంచి ఎవరూ తప్పుకోవద్దు అని, ఇలాంటి పరిస్థితుల్లో హర్షదీప్ బౌలింగ్ చేయడం కష్టమే అని, కానీ అతను గతంలోనూ నోబాల్స్ వేశాడని, అతన్ని నిందించడం కాదు అని, ఏ ఫార్మాట్లోనైనా నోబాల్ వేయడం నేరమే అవుతుందని తెలిపాడు. పవర్ప్లే సమయంలో ఇండియా సరిగా ఆడలేదన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ సమయంలో ఉన్న పవర్ప్లేలో భారత్ విఫలమైనట్లు పాండ్యా తెలిపాడు.