Border -Gavaskar Trophy : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ఓడిపోయిన ఆస్ట్రేలియాకు షాక్. మిగతా రెండు టెస్టులకు కూడా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హేజిల్వుడ్ దూరం కానున్నాడు. గాయం కారణంగా అతను తొలి రెండు టెస్టులు ఆడలేదు. సిడ్నీ టెస్టులో అయిన అషిల్లేస్ గాయం నుంచి హేజిల్వుడ్ ఇంకా కోలుకోలేదు. దాంతో, అతను స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. అతనితో పాటు ఓపెనర్ డేవిడ్ వార్నర్, అష్టన్ అగర్, మ్యాట్ రెన్షా కూడా బయలుదేరనున్నారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తా సంస్థ తెలిపింది.
కుటుంబంలో ఒకరికి తీవ్రమైన ఆనారోగ్యం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా స్వదేశానికి వెళ్తున్నాడు. అతను మూడో టెస్టు సమయానికి ఇండియా రానున్నాడు. ఒకవేళ కమిన్స్ మార్చి 1 లోపు రాకుంటే స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ కంకషన్గా పెవిలియన్ చేరాడు. బంతి బలంగా చేతికి తాకడంతో అతను మైదానం వీడాడు. అతని ప్లేస్లో ట్రావిస్ హెడ్ ఆడాడు.
గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్, ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్కార్ట్ ఇండోర్ టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. టెస్టు జట్టులో మార్పుల గురించి ఆసీస్ మేనేజ్మెంట్ బుధవారం అధికారికంగా వెల్లడించనుంది. ఢిల్లీ టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 10 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్లో జడ్డూ 7 వికెట్లు తీయడంతో ఆసీస్ 113కే కుప్పకూలింది.
నాగ్పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 132 రన్స్తో ఇండియా, ఆస్ట్రేలియాను ఓడించింది. దాంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో ఉంది. అంతేకాదు.. ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దిశగా ముందుడుగు వేసింది. ఇండోర్, అహ్మదాబాద్ టెస్టుల్లో ఏదో ఒకటి గెలిచినా కూడా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ టైటిల్ పోరు జరగనుంది.