మెల్బోర్న్: తొలిసారి జట్టు కట్టిన భారత స్టార్ టెన్నిస్ ఆటగాళ్లు రోహన్ బోపన్న-రామ్కుమార్ రామనాథన్ అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్కు ముందు జరిగిన ఏటీపీ-250 డబుల్స్ ఫైనల్లో ఆదివారం బోపన్న-రామ్కుమార్ జోడీ 7-6 (8/6), 6-1తో టాప్సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)-మారసెలో మెలో (బ్రెజిల్) ద్వయంపై విజయం సాధించింది. గంటా 21 నిమిషాల పాటు సాగిన పోరులో బోపన్న తన సర్వీస్ రిటర్న్లతో ఆకట్టుకోగా.. రామ్కుమార్ ఆల్రౌండ్ షో కనబర్చాడు. తొలి సెట్లో నాలుగు బ్రేక్ పాయింట్లు కాచుకున్న ఈ జంట.. రెండో సెట్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. మ్యాచ్ మొత్తంలో బోపన్న జోడీ 9 ఏస్లు సంధించగా.. ప్రత్యర్థి ద్వయం 3 ఏస్లకే పరిమితమైంది. బోపన్నకు ఇది 20వ ఏటీపీ డబుల్స్ టైటిల్ కాగా.. రామ్కుమార్కు మొదటిది. ఈ విజయంతో 18,700 డాలర్ల (రూ. 13.88 లక్షలు) ప్రైజ్మనీ సొంతం చేసుకున్న ఈ జోడీ 250 ర్యాంకింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకుంది.