AUSvsIND T20I: టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్పై లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు. సీనియర్ల గైర్హాజరీతో స్వదేశంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ రాజస్తాన్ కుర్రాడు.. ఐదు మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. వచ్చే ఏడాదిలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్లో భారత్ అతడిని ఆడించాలని మురళీధరన్ తెలిపాడు.
మురళీధరన్ మాట్లాడుతూ.. భారత్లో తరానికి ఒక మంచి స్పిన్నర్ వస్తున్నాడు. అనిల్ కుంబ్లే నుంచి చూసుకుంటే అతడి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ స్పిన్నర్గా రాణిస్తున్నాడు. ఇప్పుడు ఆ జాబితాలో బిష్ణోయ్ చేరాడు. ఇతర లెగ్ స్పిన్నర్లతో పోలిస్తే బిష్ణోయ్ కాస్త ప్రత్యేకం. అతడి బంతిని సంధించే శైలి భిన్నంగా ఉంటుంది. బిష్ణోయ్తో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా బాగానే స్పిన్ రాబడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ బంతిని పెద్దగా టర్న్ చేయలేకపోయినా కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తున్నాడు.. అని అన్నాడు.
ఇప్పటికే భారత్ నుంచి కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉన్నా ఆస్ట్రేలియాతో సిరీస్లో రవి బిష్ణోయ్ రాణించడంతో వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్లో అతడు కూడా స్పిన్ విభాగంలో తీవ్ర పోటీనిస్తున్నాడు. ప్రధాన సిరీస్లకు ఎంపికవడం అతడికి ఇదే ప్రథమం. గతంలో ఐర్లాండ్, ఆసియా క్రీడలలోనే బిష్ణోయ్ కు అవకాశాలు దక్కాయి.