Wresting Selection Trails | భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, రవి దహియాలకు భారీ షాక్. 2021లో జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన ఈ ఇద్దరు రెజ్లర్లూ.. ఈ ఏడాది జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. సొన్పట్ (హర్యానా)లోని శాయ్ అకాడమీలో జరుగుతున్న రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్లో ఈ ఇద్దరూ వారి ప్రత్యర్థుల చేతిలో చిత్తయ్యారు. ఈ ట్రయల్స్లో గెలిచినవారు ఆసియన్ ఛాంపియన్షిప్స్తో పాటు ఏప్రిల్ 19 నుంచి 21 మధ్య బిష్కెక్ లో జరగాల్సి ఉన్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించారు.
డబ్ల్యూఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెలక్షన్ ట్రయల్స్లో బజరంగ్.. 1-9 తేడాతో రోహిత్ కుమార్ చేతిలో ఓడిపోయాడు. పురుషుల ఫ్రీ స్టయిల్ 65 కిలోల విభాగంలోని సెమీస్ పోరులో పునియా చిత్తయ్యాడు. ఈ ట్రయల్స్కు ముందు పునియా రష్యా వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్నా తాజా ఓటమితో అది ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే అయింది. రోహిత్ చేతిలో ఓడిపోవగానే పునియా శాయ్ అకాడమీ నుంచి హుటాహుటిగా ఇంటికి వెళ్లిపోయాడు. పునియా టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
ఇక పురుషుల 57 కిలోల విభాగంలో పోటీ పడ్డ టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవి దహియా కూడా యువ బాక్సర్ అమన్ సెహ్రావత్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దహియా.. 13-14 తేడాతో అమన్ చేతిలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఈ ఇద్దరూ ఓడిపోవడంతో వీళ్లు పారిస్ ఒలింపిక్స్లో బెర్త్ కోల్పోవడం దాదాపుగా ఖరారైంది. అయితే నిబంధనలు ఏమైనా సడిలిస్తే తప్ప ఈ ఇద్దరూ ఒలింపిక్స్లో ఆడటం కష్టమే. ఇది ఈ ఇద్దరికే గాక భారత రెజ్లింగ్ అభిమానులకూ షాక్ వంటిదే. పునియాను సెమీస్లో ఓడించిన రోహిత్ను.. సుజీత్ కల్కల్ ఓడించి విజేతగా నిలిచాడు.
ఆసియా ఛాంపియన్షిప్కు భారత ఫ్రీ స్టయిల్ టీమ్ :
– అమన్ సెహ్రావత్ – 57 కిలోలు
– సుజీత్ కల్కల్ – 65 కిలోలు
– జైదీప్ – 75 కిలోలు
– దీపక్ పునియా – 86 కిలోలు
– దీపక్ నెహ్రా – 97 కిలోలు
– సుమిత్ మాలిక్ – 125 కిలోలు