Border – Gavaskar Trophy : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో ఉందనగా పర్యాటక ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ గాయం కారణంగా నాగ్పూర్ టెస్టుకు దూరం కానున్నాడు. ఢిల్లీలో జరగనున్న రెండో టెస్టుకు కూడా అతను అందుబాటులో ఉండకపోవచ్చు అని సమాచారం. దాంతో, అతని స్థానంలో స్కాట్ బొలాండ్ జట్టులోకి రానున్నాడు. విదీశీ గడ్డ మీద అతను తొలి మ్యాచ్ ఆడనున్నాడు. జనవరిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిడ్నీ టెస్టులో హేజిల్వుడ్ గాయపడ్డాడు. ఎడమ కాలికి అయిన అషిల్లెస్ గాయం నుంచి తానింకా కోలుకోలేదని అతను తెలిపాడు.
గ్రీన్ ఆడేది అనుమానమే..!
‘మొదటి టెస్టు ఆడతానో లేనో చెప్పలేను. కోలుకునేందుకు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. గురువారం ప్రారంభం కానున్న నాగ్పూర్ టెస్టులో అంతా సాఫీగా జరుగుతుందని అనుకుంటున్నా’ అని హేజిల్వుడ్ అన్నాడు. ఇప్పటికే ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలి రెండు మ్యాచ్లకి దూరమైన విషయం తెలిసిందే. ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దాంతో, అతను కూడా తొలి టెస్టులో ఆడేది అనుమానమే. దాంతో, ఈ ముగ్గురి గైర్హాజరీలో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది.
రెండు టెస్టులకు బుమ్రా దూరం
భారత జట్టును కూడా గాయాలు వేధిస్తున్నాయి. స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. పేసర్ బుమ్రా కూడా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో పునరాగమనం చేయనున్నాడు. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా, భారత పర్యటనలో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ ఫైనల్) ముందు జరగుతున్న కీలకమైన సిరీస్ ఇది. భారత్కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు కోసం ఈ సిరీస్ చాలా ముఖ్యం. దాంతో, రెండు ప్రపంచస్థాయి జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా ఉండనుంది.