బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు ముందు భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహై సంచలన ఆరోపణలు చేసింది. టోక్యో ఒలింపిక్స్లో తాను పతకం సాధించడంలో వెన్నంటి నిలిచిన కోచ్లు సంధ్య గురుంగ్, ఆమెయ్ కోలెకర్ను జాబితా నుంచి తప్పించడంపై లవ్లీనా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఐర్లాండ్లో శిక్షణ ముగించుకుని ఆదివారం భారత బాక్సింగ్ బృందం బర్మింగ్హామ్కు చేరుకుంది. అక్రిడిటేషన్లు లేని కారణంగా లవ్లీన కోచ్ సంధ్యకు గేమ్స్ విలేజ్లోకి అనుమతి లభించకపోగా, ఆమెయ్ను స్వదేశానికి పంపిచారు.
అధికారులు తనను వేధిస్తున్నారని..శిక్షణపై రాజకీయాలు ప్రభావం చూపిస్తున్నాయంటూ లవ్లీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ వేదికగా తనకు ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ‘బరువెక్కిన హృదయంతో నాపై కొనసాగుతున్న వేధింపులను అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నా కోచ్ సంధ్యకు అనుమతి లేకపోవడంతో ఆమె గేమ్స్ విలేజ్ బయట ఉండిపోయింది. మరో కోచ్ను భారత్కు పంపించారు.
ఇది నా ట్రైనింగ్ షెడ్యూల్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. రెండు చేతులు జోడించి చెబుతున్నా..నా కోచ్లను భారత బృందంలో భాగం చేయండి. కోచ్లను దూరం చేయడం వలన మానసికంగా వేదన ఎదుర్కొంటున్నాను. ప్రపంచ చాంపియన్షిప్లో ఇదే పరిస్థితి ఎదురవడం వలన పతకం గెలువలేకపోయాను.
కానీ సారి అలా కాకుండా దేశం తరఫున కచ్చితంగా పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాను’ అని రాసుకొచ్చింది. ఈ వివాదంపై భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) వెంటనే కలుగజేసుకుని సమస్యను పరిష్కరించాలని కేంద్ర క్రీడాశాఖ ఆదేశాలు జారీ చేసింది.