భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా త్వరలోనే తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యసభకు ఎంపీగా నియమితుడైన ఆయన.. త్వరలోనే బీసీసీఐ నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తున్నది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ప్రజా సేవ (పబ్లిక్ సర్వెంట్)లో ఉన్న వ్యక్తి బోర్డులో ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించడానికి అవకాశం లేదు.
2020 డిసెంబర్ నుంచి బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజీవ్ శుక్లా ఇటీవలే ఛత్తీస్గఢ్ నుంచి రాజ్యసభ (కాంగ్రెస్ పార్టీ తరఫున) కు ఎన్నికయ్యాడు. దీంతో ఆయన నిబంధనల ప్రకారం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
‘నిబంధనల ప్రకారం శుక్లా తన పదవి నుంచి వైదొలగాలి. అయితే ఈ విషయమై చర్చించడానికి గాను ఆఫీస్ బేరర్స్ అంతా ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్నారు. శుక్లా రాజ్యసభ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ గురువారం (జులై 21) నిర్వహించబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై ప్రకటన వెలువడే అవకాశముంది’ అని బీసీసీఐ కి చెందిన ఓ అధికారి వెల్లడించాడు. శుక్లా కూడా అపెక్స్ కౌన్సిల్ సభ్యుడే. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.
— Rajeev Shukla (@ShuklaRajiv) July 18, 2022