Rahul Dravid: వన్డే వరల్డ్ కప్తోనే కాంట్రాక్టులు ముగిసినా టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ను ఆ పదవిలో కొనసాగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ద్రావిడ్తో పాటు కోచింగ్ సిబ్బంది విక్రమ్ రాథోడ్, పరాస్ మంబ్రే, శ్రీదర్ల కాంట్రాక్టులు కూడా పొడిగించింది. అయితే వీరి కాంట్రాక్టు ఎప్పటిదాకా..? అనేది మాత్రం స్పష్టత లేదు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో అప్పటిదాకా రాహుల్ ద్రావిడ్ను కొనసాగిస్తారా..? లేక అతడి కాంట్రాక్టును పొడిగిస్తారా..? అనే విషయాలపై సౌతాఫ్రికా టూర్ తర్వాత ఓ క్లారిటీ రానుంది. ద్రావిడ్ కాంట్రాక్టు పొడగింపుపై సౌతాఫ్రికా నుంచి అతడు వచ్చాక చర్చిస్తామని బీసీసీఐ సెక్రెటరీ జై షా తెలిపాడు.
జై షా మాట్లాడుతూ.. ‘మేము ద్రావిడ్ కాంట్రాక్టును పొడగించినప్పుడు సమయం లేదు. వాళ్ల (కోచింగ్ టీమ్)ను కలిసి పరస్పర అంగీకారంతో వారినే కొనసాగించాం. సౌతాఫ్రికా టూర్ నుంచి వాళ్లు తిరిగొచ్చిన తర్వాత మేం మరోసారి సమావేశమవుతాం. ద్రావిడ్తో పాటు కోచింగ్ సిబ్బంది కాంట్రాక్టును ఎప్పటిదాకా పొడగించాలి..? అన్నది అప్పుడే మాట్లాడుకుంటాం.. ’ అని తెలిపాడు.
మూడు ఫార్మాట్ల సిరీస్లు ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లిన భారత జట్టు ఆదివారం నుంచి డర్బన్ వేదికగా మొదలుకాబోయే టీ20 సిరీస్తో టూర్ను ఆరంభిస్తుంది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల తర్వాత డిసెంబర్ 17 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొదలుకానుంది. అనంతరం డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది. జనవరి 7 వరకు సాగే ఈ టూర్లో భారత్ మూడు ఫార్మాట్లలో 8 మ్యాచ్లు ఆడనుంది. ఈ టూర్ ముగిసిన వెంటనే భారత్లో అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ మొదలవుతుంది.