లండన్: క్రికెటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ అతని అంతర్జాతీయ కెరీర్లో చివరి వన్డే అవుతుందని రూమర్స్ వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. లార్డ్స్ వన్డే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాదు అని ఆయన అన్నారు. రోహిత్ భవిష్యత్తుపై మీడియాలో కథనాలు వ్యాపిస్తున్నాయని, అయితే లార్డ్స్లో రోహిత్ చివరి వన్డే ఆడుతాడాన్న చర్చలు జరగలేదని సైకియా తెలిపారు. భారత వన్డే జట్టులో రోహిత్ శర్మ రెగ్యులర్ సభ్యుడు అని, దేశానికి అతను వీలైనంత కాలం ప్రాతినిధ్యం వహిస్తాడన్నారు. లార్డ్స్లో జరిగే వన్డే అతని కెరీర్లో చివరిది కాబోదన్నారు.
London Calling 📍👋 #TeamIndia has arrived for the all-important series decider 🙌#ENGvIND pic.twitter.com/TwpVIepLw1
— BCCI (@BCCI) July 18, 2026
గణాంకాలు బాగున్నా.. తగ్గిన రోహిత్ దూకుడు
చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రోహిత్ 14 వన్డే ఇన్నింగ్స్ల్లో 45.3 సగటు, 92.03 స్ట్రైక్ రేట్తో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 589 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు అతడి కెరీర్ సగటు (48.58 సగటు, 92.76 స్ట్రైక్ రేట్)కు దగ్గరగానే ఉన్నప్పటికీ, పరుగులు సాధిస్తున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్లో 54.27 సగటు, 125.94 భీకర స్ట్రైక్ రేట్తో ఆడి భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్ మార్క్ దూకుడు ప్రస్తుత ఆటలో కనిపించడం లేదు.
ప్రతి ఇన్నింగ్స్ అతడికి ఒక పరీక్షలా మారడంతో క్రీజులో స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. మరోవైపు, జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఓపెనర్ స్థానం కోసం 24 ఏండ్ల ముంబై యువ సంచలనం యశస్వి జైస్వాల్ వన్డేల్లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. చివరి మూడు వన్డేల్లోనే జైస్వాల్ రెండు శతకాలు బాదాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన రుతురాజ్ కూడా రేసులోకి రావడంతో రోహిత్పై ఒత్తిడి పెరిగింది.