టీ 20 వరల్డ్ కప్లో భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. జట్టు కూర్పు సరిగ్గా లేదని మాజీ క్రికెటర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో, చేతన్ శర్మ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీపై శుక్రవారం బీసీసీఐ వేటు వేసింది. సునీల్ జోషి, హర్విందర్ సింగ్ దెబాశిష్ మొహంతీ, చేతన్ శర్మ సభ్యులుగా ఉన్న ఈ కమిటీని బీసీసీఐ తొలగించింది. కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిచింది కూడా.
జాతీయ ఎంపిక కమిటీకి పోటీ చేసేవాళ్లకు ఉండాల్సిన కనీస అర్హతలను కూడా బీసీసీఐ ప్రస్తావించింది. అవేంటంటే.. నేషనల్ సెలెక్ట్ కమిటీకి దరఖాస్తు చేసేవాళ్లు కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాలి. లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు అయినా ఆడాలి’ అని బీసీసీఐ తెలిపింది. అంతేకాదు ఐదేళ్ల క్రితం క్రికెట్కు వీడ్కోలు పలికినవాళ్లు, ఐదేళ్లపాటు ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా లేనివాళ్లకు ప్రాధాన్యం ఉంటుందని బీసీసీఐ వెల్లండించింది. ఆసక్తి ఉన్నవాళ్లు నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు పంపాల్సిందిగా కోరింది.
మాజీ క్రికెటర్ అయిన చేతన్ శర్మ 2020 డిసెంబర్లో నేషనల్ చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. ఇతని ఆధ్వర్యంలో భారత జట్టు పోయిన ఏడాది వరల్డ్ కప్లో నాకౌట్ స్టేజీలోనే ఇంటిదారి పట్టింది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఆసియా కప్లోనూ విఫలమైంది. దాంతో, సెలక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.