కోల్కతా: దక్షిణాఫ్రికాలో టూర్ చేయనున్న టీమిండియా వన్డే జట్టుకు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ వైఖరిని తప్పుపడుతూ కోహ్లీ బుధవారం మీడియాతో మాట్లాడారు. రోహిత్తో విభేదాలు లేవని, వన్డేల్లో ఆడాలని ఉందని కోహ్లీ ఆ మీటింగ్లో తెలిపాడు. టెస్టు జట్టుకు కెప్టెన్గా ఎన్నిక చేయడానికి గంటన్నర ముందు మాత్రమే తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారన్నారు. దీంతో బీసీసీఐ, కోహ్లీ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టం అయ్యింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఇవాళ ఓ మీడియా సంస్థ సంప్రదించింది. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వివాదంపై స్పందించేందుకు సౌరవ్ గంగూలీ నిరాకరించారు. ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు గంగూలీ స్పందిస్తూ .. ఆ అంశంపై ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదన్నారు. బీసీసీఐ ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు గంగూలీ తెలిపారు. ఈ సమయంలో ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదని సౌరవ్ చాలా గట్టిగా చెప్పారు. సఫారీ టూర్కు వన్డే కెప్టెన్గా రోహిత్ను నియమించిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ, బీసీసీఐ మధ్య బేధాభిప్రాయాలు బయటపడ్డాయి. నిజానికి నాయకత్వ మార్పుకు ముందు కోహ్లీతో మాట్లాడినట్లు గంగూలీ జట్టును ప్రకటించిన మరుసటి రోజే ఓ మీడియాతో తెలిపారు. కానీ కోహ్లీ, బీసీసీఐ మధ్య వివాదం మాత్రం ముదురుతోంది.