ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు కొత్త ఫ్రాంచైజీల ( IPL New Franchises ) కోసం మంగళవారం టెండర్లు ఆహ్వానించింది బీసీసీఐ. 2022 ఐపీఎల్ సీజన్లో పాల్గొనబోయే రెండు కొత్త టీమ్స్లో ఒకదాని కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బిడ్లను ఆహ్వానించిందని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టెండర్ డాక్యుమెంట్లు అక్టోబర్ 5 వరకూ అమ్మకానికి ఉండనున్నట్లు చెప్పింది. ఈ ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్ను రూ.10 లక్షలుగా నిర్ణయించింది. ఇది నాన్ రిఫండబుల్ మొత్తం. ఈ డాక్యుమెంట్లోనే సవివరంగా నియమ, నిబంధనలు.. అర్హత, బిడ్ల దాఖలు ప్రక్రియ, కొత్త టీమ్స్ హక్కుల వివరాలన్నీ ఉంటాయని బీసీసీఐ చెప్పింది.
బిడ్ దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు ఈ ఇన్విటేషన్ టు టెండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే అందులోని అర్హత ప్రమాణాలు అందుకున్న వారికే బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంటుందని, దీనిని కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ బిడ్లు దాఖలు చేయలేరని స్పష్టం చేసింది. కొన్ని నెలలుగా ఈ కొత్త టీమ్స్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ఈ రెండు టీమ్స్లో ఒకటి అహ్మదాబాద్ కావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ టీమ్ ఒక్కోదానికి కనీస ధరను రూ.2 వేల కోట్లుగా నిర్ణయించగా.. ఈ రెండు టీమ్స్ ద్వారా బీసీసీఐ ఖాతాలో మరో రూ.5 వేల కోట్లు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.