సూర్యాపేట టౌన్: సూర్యాపేట మరోమారు క్రీడాటోర్నీకి వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు సూర్యాపేట వేదికగా రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పోటీలకు ఆతిథ్యం అందిస్తున్నారు. సొంత ఖర్చులతో వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి మంగళవారం ప్రకటించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అందుకు అనువైన మైదానాల కోసం మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, శివారులోని లయోల పాఠశాల మైదానాలను పరిశీలించారు. అండర్-16 విభాగంలో జరిగే ఈ పోటీలకు బాల బాలికలతో సహా మొత్తం 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.