బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్ఇండియాపై వన్డే సిరీస్ చేజిక్కించుకున్న బంగ్లాదేశ్.. తొలి టెస్టులోనూ స్థాయికి మించి పోరాడుతున్నది. భారీ లక్ష్యఛేదనలో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేస్తుందనుకుంటే.. రోజంతా బ్యాటింగ్ చేసి 6 వికెట్లే కోల్పోయింది. నేడు ఆటకు చివరి రోజు కాగా.. బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగుల దూరంలో ఉంది. అరంగేట్ర ఆటగాడు జాకిర్ హసన్ సెంచరీతో ఆకట్టుకోగా.. పాతకాపు షకీబ్ పోరాడుతున్నాడు. ఆదివారం మనవాళ్లు మిగిలిన నాలుగు వికెట్లు ఎంత త్వరగా పడగొడతారో చూడాలి!
చటోగ్రామ్: టీమ్ఇండియా ఘనవిజయం సాధించడం ఖాయం అనుకున్న పోరులో బంగ్లాదేశ్ తమ పోరాటంతో ఆకట్టుకుంది. 513 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా.. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న జాకిర్ హసన్ (100; 13 ఫోర్లు, ఒక సిక్సర్) శతక్కొట్టగా.. నజ్ముల్ హసన్ శాంటో (67), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, అశ్విన్, కుల్దీప్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఓవర్నైట్ స్కోరు 42/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా.. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొందనే చెప్పాలి. రోజంతా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 6 వికెట్లే కోల్పోయింది. ముఖ్యంగా తొలి మ్యాచ్ ఆడుతున్న జాకిర్ అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. దాదాపు నాలుగు గంటల పాటు క్రీజులో నిలిచిన జాకిర్ తొలి వికెట్కు నజ్ముల్తో కలిసి 124 పరుగులు జోడించాడు.