ఆల్ అమెరాత్: టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో అనూహ్య పరాజయం పాలైన బంగ్లా..మలి మ్యాచ్లో జూలు విదిల్చింది. మంగళవారం ఒమన్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహ్మదుల్లా కెప్టెన్సీలోని బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. ఓపెనర్ మహమ్మద్ నయిమ్(50 బంతుల్లో 64) అర్ధసెంచరీతో అదరగొట్టగా వెటరన్ షకీబల్ హసన్(42) సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 21 పరుగులకే లిటన్ దాస్(6), మెహదీ హసన్(0) వికెట్లు కోల్పోయిన తరుణంలో వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. షకీబల్ సహకారంతో నయిమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒమన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గాడిలో పడిందనుకున్న తరుణంలో బంగ్లా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మహ్మదుల్లా(17), ముష్ఫీకర్ రహీమ్(6) ఘోరంగా నిరాశపరిచారు. బిలాల్ ఖాన్(3/18), ఫయాజ్ భట్(3/30), ఖలీముల్లా(2/30) రాణించారు. ఆ తర్వాత 154 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఒమన్..ముస్తాఫిజుర్ రెహమాన్(4/36), షకీబల్ హసన్(3/28) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఓపెనర్ జతిందర్సింగ్(40) ఆకట్టుకోగా, మిగిలిన వారు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న షకీబల్ హసన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లా..గ్రూపు-బిలో మూడో స్థానంలో కొనసాగుతున్నది. మరో మ్యాచ్లో పపువా న్యుగినియాపై స్కాట్లాండ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అర్ధసెంచరీతో విజృంభించిన రిచీ బెరింగ్టన్(70)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.