మీర్పూర్: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ వైట్వాష్కు గురైంది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లిష్ జట్టు 0-3తో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ‘బజ్ బాల్’క్రికెట్ పేరిట దంచికొట్టడమే పరమావధిగా సాగుతున్న ఇంగ్లండ్కు ఈ పరాజయం పెద్ద షాక్కు గురిచేసింది. ఓ పెద్ద ప్రత్యర్థిపై బంగ్లాదేశ్ సిరీస్ క్లీన్స్వీప్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. మంగళవారం జరిగిన చివరి టీ20లో బంగ్లా 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది.
లిటన్ దాస్ (73; 10 ఫోర్లు, ఒక సిక్సర్), నజ్ముల్ హసన్ (47 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ మలాన్ (53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (40; 4 ఫోర్లు, ఒక సిక్సర్) మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కీన్ 2 వికెట్లు పడగొట్టాడు. లిటన్ దాస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, నజ్ముల్ హసన్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.