Babar Azam: వన్డే ప్రపంచకప్ వైఫల్యం పాకిస్తాన్ను వెంటాడుతోంది. ఘోర వైఫల్యం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలక్షన్ కమిటీని రద్దు చేయగా తాజాగా ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. వరల్డ్ కప్లో జట్టు పేలవ ప్రదర్శన అనంతరం అతడు మూడు ఫార్మాట్ల సారథ్య బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. 2019 నుంచి పాక్ క్రికెట్ జట్టుకు సారథిగా సేవలందిస్తున్న బాబర్.. కీలక టోర్నీలలో విఫలమవుతూ తీవ్ర విమర్శలపాలవుతున్న విషయం తెలిసిందే.
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ లేఖ రాస్తూ.. ‘2019లో నేను పాకిస్తాన్ సారథిగా ఎంపికైన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. గత నాలుగేండ్లలో నేను చాలా ఎత్తుపల్లాలు చూశాను. కానీ క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ ప్రతిష్టను కొనసాగించాను. నా హయాంలో పాకిస్తాన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం జట్టు సమిష్టి కృషి. ఆటగాళ్లు, కోచ్లు, టీమ్ మేనేజ్మెంట్ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. నాకు మద్దతుగా నిలిచినందుకు అభిమానులకు ధన్యవాదాలు. సారథిగా వైదొలగాలన్న నా ఈ నిర్ణయం కాస్త కఠినమైందే గానీ దానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నా.. కొత్త సారథికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఈ బాధ్యతలను నాకు అప్పగించినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చాడు.
— Babar Azam (@babarazam258) November 15, 2023
2019లో పాకిస్తాన్ కెప్టెన్గా నియమితుడైన బాబర్ సారథ్యంలో పాక్.. 20 టెస్టులు, 43 వన్డేలు, 71 టీ20లు ఆడింది. అతడి హయాంలో టెస్టులలో పది మ్యాచ్లు గెలిచిన పాక్.. ఆరింటిలో ఓడి నాలుగు డ్రా చేసుకుంది. వన్డేలలో 26 గెలిచి 15 మ్యాచ్లలో ఓడింది. పొట్టి ఫార్మాట్లో 42 మ్యాచ్లు నెగ్గి 23 మ్యాచ్లలో ఓటమి చవిచూసింది.
బాబర్ హయాంలో పాకిస్తాన్ 2021లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరగా 2022 టీ20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచింది. గతేడాది ఆసియా కప్ ఫైనల్లో లంక చేతిలో ఓడింది. తాజాగా వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్కే పరిమితమైంది.