హేమాహేమీలు కనీస ప్రతిఘటన చూపలేకపోయిన చోట లోయర్ ఆర్డర్ అద్వితీయ పోరాటం కనబర్చింది. రోహిత్, రాహుల్, పుజారా, శ్రేయస్ అయ్యర్ విఫలమైన పిచ్పై పరుగులు ఎలా రాబట్టాలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చేసి చూపించాడు. ఆసీస్ స్పిన్ ధాటికి టాపార్డర్ కుప్పకూలగా.. అశ్విన్తో కలిసి ఆసీస్ను సమర్థంగా అడ్డుకున్నాడు. ఫలితంగా ఒక దశలో 139/7తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ రోహిత్ సేన.. చివరకు ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్లో ఒక పరుగు ఆధిక్యం మాత్రమే సమర్పించుకుంది. అయితే రెండో ఇన్నింగ్స్ను ధాటిగా మొదలుపెట్టిన కంగారూలు ఇప్పటికే 62 పరుగుల ఆధిక్యం సాధించారు. మూడో రోజు మన ముగ్గురు మొనగాళ్లు (అశ్విన్, అక్షర్, జడేజా) ఆసీస్ను ఎంత త్వరగా ఆలౌట్ చేస్తారనేదానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
న్యూఢిల్లీ: తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో చక్కటి ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్లో మంచి స్కోరు చేసిన ఆసీస్.. ఆ తర్వాత బౌలింగ్లోనూ విజృంభించింది. ఆసీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకున్న టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును.. ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), రవిచంద్రన్ అశ్విన్ (71 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఆదుకున్నారు.
వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించడంతో రోహిత్ సేన గట్టెక్కింది. విరాట్ కోహ్లీ (44), రోహిత్ శర్మ (32) ఫర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్ (17) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. వందో టెస్టు ఆడుతున్న చతేశ్వర్ పుజారా (0) ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఇక శ్రేయస్ అయ్యర్ (4), శ్రీకర్ భరత్ (6) విఫలం కాగా.. రవీంద్ర జడేజా (26) కాస్త పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో లియాన్ 5, మర్ఫీ, కునెమన్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ధాటిగా ఆడుతూ.. శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. వార్నర్ స్థానంలో ఓపెనర్గా అవకాశం దక్కించుకున్న ట్రావిస్ హెడ్ (39)తో పాటు మార్నస్ లబుషేన్ (16) క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ప్రస్తుతం ఆసీస్ 62 పరుగుల ముందంజలో ఉంది. ఈ పిచ్పై ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా ధాటిగా ఆడితేనే పరుగులు సాధించవచ్చని అక్షర్ నిరూపించగా.. రెండో ఇన్నింగ్స్లో దీన్నే అమలు చేసిన కంగారూలు వన్డే తరహాలో 5.08 రన్రేట్తో పరుగులు చేయడం గమనార్హం.
కోహ్లీ వివాదాస్పద ఔట్!
సొంతగడ్డపై భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు శతవిధాల ప్రయత్నించిన విరాట్ కోహ్లీ.. అంపైర్ సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరడం చర్చనీయాంశమైంది. బంతి బ్యాట్, ప్యాడ్కు ఒకేసారి తగిలినా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడంతో కోహ్లీ అసహనంగా పెవిలియన్ చేరాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్: 262 ఆలౌట్ (అక్షర్ 74, కోహ్లీ 44; లియాన్ 5/67, మర్ఫీ 2/53), ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 61/1 (హెడ్ 39*, లబుషేన్ 16*; జడేజా 1/23).