భారత స్వతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేడు దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. దేశం వజ్రోత్సవ సంబురాల్లో నిమగ్నమైన వేళ టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్టు పెట్టింది. దేశాన్ని ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘ఇండియా’గా పిలవొద్దని.. ‘భారత్’ లేదా ‘హిందూస్తాన్’గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లను కోరింది.
ఇన్స్టాగ్రామ్ వేదికగా హసీన్ ఓ వీడియోను షేర్ చేసింది. బాలీవుడ్ ప్రముఖ గీతం ‘దేశ్ రంగీలా’పాటకు ఆమె డాన్స్ చేసిన వీడియో అది. వీడియోను షేర్ చేస్తూ హసీన్ ఇలా రాసుకొచ్చింది. ‘మనదేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మనదేశం పేరు ‘భారత్’ లేదా ‘హిందూస్తాన్’ అని ఉండాలి..
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లకు నాదొక విన్నపం. ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘ఇండియా’ పేరును మార్చి ఆ స్థానంలో ‘భారత్’ లేదా ‘హిందూస్తాన్’ అని మార్చండి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది..’ అని పోస్టులో పేర్కొంది.
హసీన్ చేసిన విన్నపం కొత్తదేం కాదు. చాలాకాలంగా ఒక వర్గానికి చెందిన ప్రజలు ఈ తరహా డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. కానీ స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్బంగా హసీన్ ఈ అభ్యర్థన చేయడం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా, 2014లో వివాహ బంధంతో ఒక్కటైన షమీ-హసీన్లు 2018 నుంచి దూరంగా ఉంటున్నారు.