సిడ్నీ : ప్రపంచకప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ ఔటవగానే స్టేడియం లైబ్రరీని తలపించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. స్టేడియంలోని లక్షకుపైగా ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండిపోయారని, అది తాను ఊహించలేదన్నాడు. ఈ సందర్భం తన మనసులో చిరకాలం నిలిచిపోతుందన్నాడు. కమిన్స్ బౌలింగ్లో కోహ్లీ బంతిని వికెట్లమీదకు ఆడుకుని అవుటవగానే స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది.
అప్పటివరకు బౌండరీలు కొట్టినపుడల్లా ఉత్సాహంతో ఊగిపోయిన ప్రేక్షకులు మౌనపాత్ర వహించారు. ప్రపంచకప్ను గెలవడం తమ లక్ష్యమని, దానిని సాధించినపుడు కలిగే ఆనందం వేరని కమిన్స్ అన్నాడు. ప్రపంచకప్ గెలవాలంటే 11మంది మాత్రమే మంచి ఆటగాళ్లుంటే సరిపోదని, జట్టులోని 25మంది మెరుగైన ఆటగాళ్లుండాలన్నాడు. అందుకే ఆస్ట్రేలియా జట్టు కప్ను సాధించిందన్నాడు.