మెల్బోర్న్: యాషెస్ సిరీస్ను 4-0తో పట్టేసిన ఆస్ట్రేలియా విజయోత్సాహంతో పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమవుతున్నది. భద్రతాపరంగా ఏ ఆటగాడు అభ్యంతరం చెప్పకపోవడంతో ఆస్ట్రేలియా పూర్తిస్థాయి బృందంతో పాక్లో అడుగుపెట్టనుంది. 1998లో చివరిసారిగా పాక్లో పర్యటించిన ఆసీస్ బృందం దాదాపు 24 ఏండ్ల తర్వాత ఆ గడ్డపై అడుగుపెడుతున్నది. 2009లో శ్రీలంక క్రికెట్ బృందం బస్సుపై ఉగ్రదాడి అనంతరం పాక్ పర్యటనకు కంగారూలు వెనుకాడారు. అప్పటి నుంచి దాయాది దేశంలో పర్యటనపై ఆసీస్ వెనుకంజ వేస్తూనే ఉన్నది. ఈ క్రమంలోనే గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా పాక్ పర్యటనకు చివరి నిమిషంలో వెనుకడుగు వేశాయి. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియా పాక్ పర్యటనకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఇరు జట్ల మధ్య మార్చి 3 నుంచి టెస్టు, వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 3 టెస్టులు, మూడు వన్డేలు, ఏకైక టీ20 ఆడేందుకు ఫిబ్రవరి ఆఖరున ఆసీస్ ఆటగాళ్లు పాక్ చేరనున్నారు. మార్చి 3 నుంచి 7 వరకు కరాచీ వేదికగా తొలి టెస్టు, రావల్పిండి (12-16)లో రెండో టెస్టు, లాహోర్ (21-25)లో ఆఖరి టెస్టు, లాహోర్ వేదికగా వన్డే సిరీస్ (మార్చి 29, 31, ఏప్రిల్ 2), ఏకైక టీ20 (ఏప్రిల్ 5) జరుగనుంది.