Hockey India | పెర్త్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత హాకీ జట్టుకు వరుసగా మూడో మ్యాచ్లోనూ పరాభవం తప్పలేదు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో భారత్.. 1-2 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది.
భారత్ తరఫున 41వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ ఏకైక గోల్ కొట్టగా 44, 49వ నిమిషాల్లో ఆస్ట్రేలియా ఆటగాడు జెరెమీ హేవర్డ్ రెండు గోల్స్ కొట్టి భారత్ విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. ఆట తొలి అర్ధ భాగంలో భారత్.. ఆస్ట్రేలియాను నిలువరించింది. జుగరాజ్ గోల్తో భారత్ ఆధిక్యంలోకి వచ్చినా హేవర్డ్ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి కంగారూలను ఆధిక్యంలోకి తెచ్చాడు.