Chamari Athapathth : మహిళల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒక్కసారి కూడా సెమీస్ గడప తొక్కని శ్రీలంక (Srilanka) మరోసారి లీగ్ దశలోనే ఇంటికెళ్లనుంది. తమ జట్టు ఘోర వైఫల్యంపై కెప్టెన్ చమరి ఆటపట్టు (Chamari Athapathth) విచారం వ్యక్తం చేసింది. గ్రూప్ 2లో లంక ఐదో స్థానంలో నిలవడంపై స్పందించిన ఆటపట్టు కెప్టెన్గా తాను విఫలమయ్యానని పేర్కొంది. వెస్టిండీస్ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడిన ఆమె.. లంక సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారడం తనకెంతో బాధగా ఉందని చెప్పింది.
ఇంగ్లండ్ వేదికగా ఆద్యంతం రంజుగా సాగుతున్న మహిళల టీ20 వరల్డ్కప్లో శ్రీలంక వెనకబడింది. ఆడిన మూడు మ్యాచుల్లో ఒకేఒక విజయంతో గ్రూప్ 2లో ఐదో స్థానంలో నిలిచిన లంక.. టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి తెచ్చుకుంది. దాంతో.. తమ జట్టును ముందుకు తీసుకు వెళ్లలేకపోయానని చమరి ఆటపట్టు తెగ బాధ పడుతోంది. ‘పొట్టి ప్రపంచకప్లో గ్రూప్ దశ దాటకపోవడం మాటలకందని విషాదం. నేను దేశం తరఫున 18 ఏళ్లుగా ఆడుతున్నా. ఇది నాకు పదో టీ20 ప్రపంచకప్ అయినా సరే నేను మా జట్టును సెమీ ఫైనల్ చేర్చే అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు.
Chamari Athapaththu 🗣️’I think I’m a failure as a captain’ pic.twitter.com/MwHisfGIHP
— Cricinfo (@ESPNcricinfo) June 22, 2026
నేను వ్యక్తిగతంగా ఎన్నో మైలురాళ్లు సాధించాను. కానీ, కెప్టెన్గా మాత్రం విఫలమయ్యానని అనిపిస్తోంది. నేను జట్టును గొప్పగా నడిపేందుకు ప్రయత్నించాను. వెస్టిండీస్పై నేను మరింత బాధ్యతగా ఆడాల్సిందని అనిపిస్తోంది. నేను నిలబడి ఉంటే విండీస్పై గెలిచేవాళ్లం. మా జట్టు ఓడినందుకు నేను బాధ పడుతున్నా. ఈ ఓటమికి ఎవరినీ బాధ్యులను చేయను. ఎందుకంటే ప్లేయర్గా, కెప్టెన్గా నాపై ఎంతో బాధ్యత ఉంది. లంకను సెమీస్ చేర్చాలని కలలు కన్న నేను చివరి అవకాశాన్ని కోల్పోయానని అనిపిస్తోంది’ అని మ్యాచ్ అనంతరం ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగింది ఆటపట్టు.
గ్రూప్ 2లోని శ్రీలంక తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో 87 పరుగుల తేడాతో ఓడింది. ఆ తర్వాతి పోరులో న్యూజిలాండ్పై 5 వికెట్లతో బోణీ కొట్టిన ఆటపట్టు బృందం.. వెస్టిండీస్ ధాటికి చిత్తైంది. తదుపరి రెండు మ్యాచుల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్ను లంక ఢీకొట్టనుంది.
England and West Indies are firm favourites for a spot in the semi-finals 🤝 pic.twitter.com/5e8OavZNsi
— Cricinfo (@ESPNcricinfo) June 22, 2026
ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న లంక ఈ రెండింటా గెలిచినా ముందంజ వేసే అవకాశాలు తక్కువే. అందుకు కారణం.. పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ చివరి రెండు మ్యాచుల్లో ఒక్కటి నెగ్గినా సెమీస్ రేసులో ఉంటాయి.