జింజు(కొరియా): ఆసియా వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత్ బోణీ కొట్టింది. స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను నిరాశపరిచిన వేళ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బింద్యారాణి దేవి రజత పతకంతో మెరిసింది. శనివారం మహిళల 55కిలోల విభాగంలో బరిలోకి దిగిన బింద్యారాణి స్నాచ్లో 83కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 111కిలోలు మొత్తంగా 194కిలోలతో రెండో స్థానంలో నిలిచింది. చెన్ గువాన్, వో తీ కున్హ్ వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. తాను పోటీకి దిగింది ఒలింపిక్ విభాగం కాకపోయినా మెండైన ఆత్మవిశ్వాసంతో దేశానికి పతకాన్ని అందించింది. క్లీన్ అండ్ జెర్క్లో రజతం అందుకున్న బింద్య..ఓవరాల్గా మరో రజత పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ‘నా ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉన్నాను. ట్రయల్స్కు ముందు గాయపడ్డాను. కానీ పోటీకి ముందు శరీరం మెరుగ్గా సహకరించడం కలిసొచ్చింది’ అని అంది. ప్రస్తుతం మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోయానని బింద్య వివరించింది.