హాంగ్జౌ: అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో నేపాల్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20ల్లో 300కు పైగా పరుగులు చేసిన తొలి దేశంగా ఆ జట్టు రికార్డు నెలకొల్పింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్ 314 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
మ్యాచ్కు ముందు టాస్ గెలిచిన మంగోలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన నేపాల్ జట్టు ముందుగా కాస్త తడబడినా ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నాక వీరవిహారం చేశారు. ముఖ్యంగా ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ కుషాల్ మల్లా మంగోలియా బౌలర్లపై దండయాత్ర చేశాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ, 34 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
దాంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న 35 బంతుల్లో సెంచరీ రికార్డును కుషాల్ మల్లా బద్ధలు కొట్టాడు. ఇప్పుడు అంతర్జాతీయ టీ20ల్లో మల్లా బాదిందే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. మరో ఎండ్ నుంచి రోహిత్ పౌడెల్ 61 (27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులు), దేవేంద్ర సింగ్ ఐరీ (10 బతుల్లో 8 సిక్సులు) కూడా బ్యాట్ ఝలిపించడంతో నేపాల్ 314 పరుగుల భారీ స్కోర్ చేసింది.