హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ విభాగంలో భారత్కు మూడు పతకాలు దక్కాయి. మెన్స్ 3000 మీటర్స్ స్టీపుల్ చేజ్లో అవినాష్ సాబిల్ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఎందుకంటే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ విభాగంలో బంగారు పతకం నెగ్గిన తొలి వ్యక్తిగా అవినాష్ రికార్డుల్లోకి ఎక్కాడు.
అవినాష్ 8 నిమిషాల 19.50 సెకన్లలో రేసు పూర్తి చేసి 2018 ఆసియా క్రీడల్లో ఇరాన్కు చెందిన హుస్సేన్ కిహాని నమోదు చేసిన 8 నిమిషాల 22.79 సెకన్ల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో 13 ఏళ్ల క్రితం జరిగిన 2010 ఆసియా క్రీడల్లో సుధా సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత ఈ విభాగంలో ఇదే తొలి గోల్డ్ మెడల్.
ఇదిలావుంటే మహళల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ ఈవెంట్లో బంగారు పతకం చేజారిపోయింది కానీ రజత, కాంస్య పతకాలు భారత్కే దక్కాయి. బహ్రెయిన్కు చెందిన విన్ఫ్రెడ్ యావి 9 నిమిషాల 18.28 సెకన్లలో రేసును పూర్తి చేసి గోల్డ్ మెడల్ ఎగరేసుకు పోగా, భారత్కు చెందిన పారుల్ చౌదరి 9 నిమిషాల 27.63 సెకన్ల టైమింగ్తో రజతం, ప్రీతి 9 నిమిషాల 43.22 సెకన్ల టైమింగ్తో కాంస్యం దక్కించుకున్నారు.