హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో మరో పతకం భారత్ ఖాతాలో చేరింది. మహిళల లాంగ్ జంప్ విభాగం ఫైనల్లో భారత అథ్లెట్ అన్షీ సింగ్ 6.63 మీటర్ల దూరం లంఘించడం ద్వారా రెండో స్థానంలో నిలిచి రజత పతకం నెగ్గింది. ఈ విభాగంలో బంగారు పతకం గెలుచుకున్న చైనా అథ్లెట్ క్సియాంగ్ షికి కంటే కేవలం 0.10 మీటర్లు మాత్రమే అన్షీ వెనుకబడింది. క్సియాంగ్ 6.73 మీటర్ల దూరం దునికి అగ్ర స్థానం దక్కించుకుంది.
ఇక ఇదే ఈవెంట్లో పోటీ పడిన భారత మరో అథ్లెట్ సింగ్ శైలి 6.48 మీటర్ల దూరం దునికి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె తన కెరీర్ బెస్ట్ కంటే కూడా తక్కువ దూరం లంఘించి నిరాశపర్చింది. కాగా, ఇవాళ భారత్ ఖాతాలో పతకాలు భారీగానే చేరాయి. స్టీపుల్ చేజ్లో ఒక గోల్డ్, ఒక రజతం, ఒక కాంస్యం, హెప్టాథ్లాన్లో కాంస్యం, 4×400 మీటర్స్ రిలేలో కాంస్యం, లాంగ్ జంప్లో రజతం దక్కాయి. మొత్తం పతకాల సంఖ్య 50 దాటింది. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.